- దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ
హైదరాబాద్సిటీ,వెలుగు: రైలు పట్టాలపై పనులు చేసే ముందు ముందస్తు భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం రైల్ నిలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన అగ్ని ప్రమాదాల నివారణ డ్రైవ్ల పురోగతిని పరిశీలించారు. మే నెలలో ఇంజినీరింగ్, సెక్యూరిటీ, సేఫ్టీ, ఆపరేటింగ్ తదితర విభాగాల అధికారులచే నిర్వహించిన రాత్రి వేళల్లో జరిగే ఆకస్మిక తనిఖీల వివరాలు కూడా సమీక్షించారు.
ప్రైవేట్ సైడింగ్లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రన్నింగ్ సిబ్బంది అయిన లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లకు కొత్త భద్రతా మార్గదర్శకాలు, సురక్షిత పని విధానాలపై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కొత్త అధికారిక బులెటిన్ “ఎస్సీఆర్ రైల్ సమాచార్” ను జీఎం ప్రారంభించారు. దీనివల్ల ప్రయాణికులకు తాజా సమాచారం త్వరగా అందుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రైలు ప్రయాణికులకు తాజా పరిణామాలు, సమాచారం అందుతుందన్నారు.
