- మానసిక ఆరోగ్య నిపుణుల సూచన
ఇంట్లో ఉంటూ.. ఫ్యామిలీ మెంబర్స్తో గడపండి
స్ట్రెస్ పెరిగితే.. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది
ముంబై: ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో దేశంలోని చాలా మంది ప్రజలకు కరోనా వైరస్ సోకుతుందనే భయంతో పాటు మరెన్నో భయాలు చుట్టుముడుతున్నాయి. ఉద్యోగాలు పోతాయోమో అని, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక ఎకనామిక్గా ఇబ్బందులు పడతామని మదనపడుతున్నారు. అయితే అలా ఆలోచించడం మంచిది కాదని, దాని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉంటే కరోనాను జయించవచ్చని సూచిస్తున్నారు. ఈ టైంలో స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదని, ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మానసికంగా బలంగా ఉండాలని ముంబైలో ప్రముఖ మానసిక నిపుణులు రాజేంద్ర బార్వే చెప్పారు. స్ట్రెస్ పెరిగితే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందని, అందుకే దాని నుంచి బయటకు వచ్చేందుకు ఫ్యామిలీతో గడపాలని, మనలో ఉన్న నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. మన జీవితంలోని ప్రతి బంధం ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని అన్నారు. ఈ టైంలో సోషల్ మీడియా ఒక రకంగా బాగా ఉపయోగపడుతుందని, కొంత మంది తాము చేసిన వంటలు, వాళ్లు తయారు చేస్తున్న వస్తువులను పోస్ట్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారని అన్నారు. “ మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయితే కుటుంబంతో గడపండి. అలా అని పాత విషయాలు గుర్తు తెచ్చుకుని గొడవపడొద్దు. స్ట్రెస్ వళ్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ఇబ్బందులు పడతారు. ఏమి చేయాలో దానిపై ఫోకస్ పెట్టండి.. అంతే కానీ చేయకూడని విషయాలపై కాదు” అని రాజేంద్ర సూచించారు. క్లాప్స్ కొట్టడం, చెట్లు నాటడం, దీపాలు వెలిగించడం లాంటివి దేశ ఐక్యతకు నిదర్శనం అని, అది జనాల్లో ధైర్యం నింపుతుందని అన్నారు.