రోడ్డుప్రమాదాల్లో ఆదుకున్న వారికి రూ.5వేలు గిఫ్ట్

రోడ్డుప్రమాదాల్లో ఆదుకున్న వారికి రూ.5వేలు గిఫ్ట్

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట చాలా కీలకం అని అంటుంటారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.  దీనికి సంబంధించి ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం ప్రకటించింది. 

ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు.

ఈ పథకంలో భాగంగా.... ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను డాక్టర్లతో కన్ఫాం చేసుకున్న తర్వాత పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే.. వారి పూర్తి వివరాలను ఆస్పత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.