ఆ ఫోన్ నుంచి ఫోన్లు చేసుకోలేం. మెసేజ్లు పంపించుకోలేం. వాట్సాప్లో చాటింగ్ చెయ్యలేం. ముచ్చటపడి ఓ సెల్ఫీ తీసుకోలేం. అదే గూగుల్ తీసుకొస్తున్న కొత్త ‘పేపర్ ఫోన్’!! అరె.. పైవన్నీ లేకుండానే దాన్ని ఫోన్ ఎట్లంటరు? అసలెప్పుడు దాన్ని తీసుకొచ్చిన్రు? అని ఆలోచించకండి. ఆ మధ్య గూగుల్ పిక్సెల్ 4 ఫోన్ను రిలీజ్ చేసింది. దానిని విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ పేపర్ ఫోన్నూ తీసుకొచ్చింది. నిజానికి ఇది ఫోన్ కాకపోయినా, ఓ మంచి ఉద్దేశంతోనే ఈ పేపర్ఫోన్ ఆలోచన చేసింది గూగుల్. నేటి ప్రపంచం మొత్తం స్మార్ట్ అయిపోయిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల దాకా.. ఫోన్లల్లనే మొహం పెట్టి చూస్తున్నారు కదా.
ఇదిగో, దాని నుంచి తప్పించేందుకే కంపెనీ ఈ ఉపాయం చేసింది. ఓ పెద్ద పేపర్ ముక్కను మడతపెట్టి, అందులో మన ఫోన్లలో ఉన్న ఫీచర్లను ప్రింట్ చేయించింది. మనం ఫోన్లో పెట్టుకునే వాల్పేపర్ దగ్గర్నుంచి, రోజూ మనం ఎక్కువగా వాడే యాప్స్ వరకు అన్నింటినీ పొందుపరిచింది. మనం రోజూ ఫోన్లో ఏమేం చేస్తామో వాటన్నింటినీ అందులో వివరంగా పేర్కొంటుంది. చాలా అవసరమైన యాప్స్నే వాడుకునేలా ‘డిజర్ట్ ఐల్యాండ్’ అనే ప్రోగ్రామ్ను పెట్టింది. తమ కస్టమర్ల మంచి కోసమే ఈ ఆలోచన చేసినట్టు గూగుల్ క్రియేటివ్ ల్ఆయబ్ టీం హెడ్ ఎమ్మా తుర్పిన్ చెప్పారు.
నో టెక్ సండేస్
గూగుల్ ఒక్కటే కాదు, డిజిటల్ ప్రపంచం నుంచి కాస్త ఉపశమనం కోసం చాలా కంపెనీలు, చాలా మంది ఇలాంటి కార్యక్రమాలే ప్రారంభించారు. ‘నో టెక్ సండేస్’ పేరిట ఓ కార్యక్రమమే నడుస్తోంది. అంటే ఆదివారం ఒక్క రోజు ఎలాంటి ఫోన్లు, టెక్నాలజీ పరమైన గాడ్జెట్లు వాడకూడదన్న మంచి కార్యక్రమం. అంతేకాదు, ‘నేషనల్ డే ఆఫ్ అన్ప్లగ్గింగ్’ పేరిట కొన్ని దేశాల్లో ఈవెంట్లు కూడా జరుగుతున్నాయి. టెక్నాలజీ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు కొన్ని రిసార్టులు, ట్రావెల్ సంస్థలు డిజిటల్ డిటాక్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గూగుల్ పేపర్ ఫోన్ కార్యక్రమం మొదటిదేం కాదు. అంతకుముందు 2014లో గూగుల్ కార్డ్బోర్డు కార్యక్రమాన్నీ కంపెనీ చేపట్టింది. అందులో భాగంగా స్మార్ట్ఫోన్లోని వర్చువల్ రియాలిటీ అప్లికేషన్లను ఆ కార్డ్బోర్డులోనే పెట్టింది.
