
- పెరగనున్న నిర్మాణ వ్యయం.. 8 లైన్లకు సరిపడా భూసేకరణ
- త్వరలో రైతులకు నిధులు రిలీజ్.. వచ్చే నెలలో టెండర్లు ఓపెన్
హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) నార్త్ పార్ట్ను ఆరు లైన్లుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. మొదటగా నాలుగు లైన్లుగా విస్తరించాలని అనుకున్నా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నిర్ణయం మార్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 161.5 కిలోమీటర్ల మేర నార్త్ పార్ట్ నిర్మాణం కానుంది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,104.06 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి గత ఏడాది డిసెంబరులో టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న టెండర్ల దాఖలుకు గడువు ముగిసింది. భారీ ప్రాజెక్టు కావడం, కేంద్ర కేబినెట్లో ఆమోదం, నార్త్ పార్ట్లో మరోసారి ట్రాఫిక్ పై సర్వే చేయాలని కేంద్రం ఆదేశించడంతో టెండర్లు ఓపెన్ చేయలేదు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరు లైన్ల నిర్మాణం చేపడుతూనే.. 8 లైన్లకు సరిపడా భూసేకరణ చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
పెరగనున్న అంచనా వ్యయం
నాలుగు లైన్ల నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణానికి రూ.7,104. 06 కోట్లకు ఎన్ హెచ్ ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) టెండర్లు పిలిచింది. ఇందుకు 1,950 హెక్టార్ల భూమి సేకరించారు. రైతులకు పరిహారం కింద రూ.5,100 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి.
భూసేకరణ పూర్తి కాగా ఇటీవలే పర్యావరణ అనుమతులూ వచ్చాయి. భూ సేకరణలో రాష్ట్ర వాటాకు సంబంధించి ఇటీవల బడ్జెట్ లో ప్రభుత్వం తొలి విడతగా రూ.1,250 కోట్లను కేటాయించింది. అయితే మొత్తంగా నాలుగు లైన్లను ఆరు లైన్లుగా మార్చడం, భూ సేకరణ 8 లైన్లకు చేస్తుండడంతో నార్త్పార్ట్నిర్మాణ వ్యయం మరోరూ.2 వేల కోట్లు పెరగనుందని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు.
గడ్కరీకి వినతి
ట్రిపుల్ఆర్ నార్త్ పార్ట్ టెండర్లు సాధ్యమైనంత త్వరగా ఓపెన్ చేయాలని, కేంద్ర కేబినెట్ ఈ ప్రాజెక్టును ఆమోదించాలని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ ను కూడా కేంద్రమే నిర్మించాలని ఇప్పటికే పలుమార్లు కోరగా, తాజాగా మళ్లీ విజ్ఞప్తి చేశారు. సౌత్ పార్ట్ డీపీఆర్ తయారీ బాధ్యతలను ఇటీవల ఓ కన్సల్టెన్సీకి ప్రభుత్వం అప్పగించింది.