ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలోని ఆయన ఆఫీస్ లో కలిశారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఈ ఉదయం ఢిల్లీ వెళ్లిన తమిళిసై.. ప్రధానమంత్రితో సమావేశం అయ్యారు. దాదాపుగా అరగంట పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానికి గవర్నర్ వివరించారు.
రాష్ట్ర గవర్నర్ గా పదవిలోకి వచ్చిన తర్వాత.. మొదటిసారిగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు తమిళిసై. రాష్టంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె, నిరసనలు, రాష్టంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రధానికి తెలిపారు గవర్నర్. శాంతి భద్రతలు, ప్రజారవాణా జరుగుతున్న తీరును వివరించినట్టు సమాచారం.
అమిత్ షాతోనూ తమిళిసై భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో బేటీ అయ్యారు గవర్నర్ తమిళిసై సౌందరాజన్. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిని అమిత్ షా కు వివరించారు గవర్నర్. షాతో భేటీ తర్వాత.. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరుగుపయనం అయ్యారు గవర్నర్.

