పసిపిల్లల ప్రాణాలు తీసింది వీళ్లే.. యూఎస్ అధికారుల ఫొటోలు బయటపెట్టిన ఇరాన్

పసిపిల్లల ప్రాణాలు తీసింది వీళ్లే.. యూఎస్ అధికారుల ఫొటోలు బయటపెట్టిన ఇరాన్

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు  కొనసాగుతున్న క్రమంలో ఇరాన్​ సంచలన ఆరోపణలతో కొన్ని ఫొటోలు రిలీజ్​ చేసింది.  ఫిబ్రవరి 28 న మినాబ్​ పాఠశాలపై జరిగిన ఘోర దాడికి కారణం వీళ్లే అంటూ ఇద్దరు యూఎస్​ నేవీ అధికారుల ఫొటోలను బయటపెట్టింది. దక్షిణాఫ్రికా, భారత్, నైజీరియాలోని తమ ఎంబసీ కార్యాలయాల  సోషల్​ మీడియా ప్లాట్​ ఫాం లలో ఆ ఇద్దరు అధికారుల పేర్లు, ఫొటోలను పోస్ట్ చేసింది. మినాబ్​ స్కూల్ పై దాడికి నేరుగా వీరే ఆదేశాలు ఇచ్చారని ఇరాన్ మండిపడింది. "ఈ ఇద్దరినీ గుర్తుంచుకోండి. వారికి సొంత పిల్లలు లేరా?" అంటూ సూటిగా, భావోద్వేగంతో కూడిన మేసేజ్ ను పోస్ట్ చేసింది ఇరాన్​ ఎంబసీ. 

ఇరాన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు అధికారులు అమెరికాకు చెందిన యుద్ధనౌక  యూఎస్ఎస్ స్ప్రూయెన్స్ కు చెందినవారు. వారి పేర్లు కమాండింగ్ ఆఫీసర్  లీ ఆర్. టేట్ , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  జెఫ్రీ ఇ. యార్క్ అని పేర్కొంది. పాఠశాలపై మూడుసార్లు టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది వీరేనని, 168 మందికి పైగా అమాయక పిల్లల మరణాలకు వీరే కారణమని ఇరాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఇరాన్ దౌత్యపరమైన దాడిని తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ ఆరోపణలు వచ్చాయి. అక్కడ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, ఫిబ్రవరి 28న జరిగిన దాడిని ఒక ఉద్దేశపూర్వక చర్యగా అభివర్ణించారు.

అమెరికా ఏమంటోందంటే..

అయితే, ది న్యూయార్క్ టైమ్స్ ,ఇతర మీడియా సంస్థల ప్రకారం.. ఈ ఘటనపై అమెరికా వాదన మరోలా ఉంది. అదొక టార్గెటింగ్​ పొరపాటు అని అమెరికా సైన్యం చెబుతోంది.  పాఠశాల భవనంలో గతంలో ఇరాన్​  మిలిటరీ బేస్​ లో భాగంగా ఉంది.. పాత ఇంటెలిజెన్స్ డేటా, పాత మ్యాప్​ ల ఆధారంగా లక్ష్యాన్ని గుర్తించడంలో పొరపాటు జరిగిందని.. పాఠశాలపై దాడి జరిగిందని ఉద్దేశ్యపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా వాదిస్తోంది. 

►ALSO READ | డాక్టర్లేనా అసలు ? సర్జరీ టైంలో జోకులు వేస్తూ, నవ్వుతు.. లాహోర్ ఆసుపత్రిలో నిర్వాకం!

ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న 'షజరా తయ్యేబే' బాలికల ప్రాథమిక పాఠశాలపై క్షిపణి దాడి విషయం తెలిసిందే.ఈ ఘటనలో దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా 7 నుండి 12 ఏళ్ల వయసున్న విద్యార్థినులే ఉన్నారు. ఇది ఇటీవల కాలంలో పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది.