హైదరాబాద్, వెలుగు: రంగమేదైనా సరే ప్యాషనేట్గా పని చేయాలని, అలా ఉంటేనే పదిమందిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని గవర్నర్ తమిళి సై అన్నారు. ఫైన్ ఆర్ట్స్ అంటేనే క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఫీల్డ్ అన్నారు. అవకాశాల కోసం వేచి చూస్తూ స్టూడెంట్లు టైం వేస్ట్ చేసుకోవద్దని, అవకాశాలను అందిపుచ్చుకునేలా నేటి తరం ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ మాదాపుర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో గవర్నర్ మాట్లాడారు. ‘యంగ్ తెలంగాణ క్రియేటివ్ మైండ్స్.. లెట్స్ ప్రిపేర్ ఫర్ ఎనీ చాలెంజ్’ అంటూ స్టూడెంట్స్ లో జోష్ నింపారు. ఫైన్ ఆర్ట్ ట్రెండ్స్, ఆర్కిటెక్చర్, యానిమేషన్, ఇంటిరీయర్ డిజైన్, ప్లానింగ్ కోర్సు ఏదైనా సరే అందులో టాప్లో ఉండేందుకు కృషి చేయాలని సూచించారు.
ఆలయాలపై స్టడీ చేయాలె
సింగిల్ స్టోన్ ఆధారంగా కట్టిన తంజావూర్ టెంపుల్ మన ప్రాచీన భారతీయ ఆర్కిటెక్చర్ నిర్మాణానికి రోల్ మోడల్గా నిలుస్తుందని గవర్నర్ అన్నారు. దేశంలోని ఆలయాలు మనకు చారిత్రక సంపదగా నిలుస్తున్నాయని, వాటి అర్కిటెక్చర్, ప్లానింగ్పై స్టూడెంట్స్ స్టడీ చేయాలన్నారు. తమిళనాడులోని పురాతన ఆలయాలు అద్భుత నిర్మాణాలన్నారు. మహబలిపురంలో ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్తో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఆ భేటీ తర్వాత సుమారు 2 లక్షల మంది చైనీయులు మహబలిపురాన్ని సందర్శించారన్నారు. బ్యూటీ ఆఫ్ ఇమాజినేషన్కు సంబంధించిన చారిత్రక ప్రదేశాలు దేశంలో ఎన్నో ఉన్నాయని, వాటిని స్టూడెంట్స్ ఒక్క సారైనా సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. కాన్వొకేషన్లో 2012–13 నుంచి 2018–19 వరకు ఐదుగురు స్టూడెంట్స్ కు పీహెచ్డీ పట్టాలు, 242 మందికి గోల్డ్ మెడల్స్, 6,219 మందికి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలను గెస్టులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ సెక్రెటరీ జనార్దన్ రెడ్డి, వర్సిటీ వీసీ కవితా దర్యాణి రావు, రిజిస్ట్రార్ వి.పణిశ్రీ, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, పేరెంట్స్ హాజరయ్యారు.