
- తమిళిసై తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించాలి: రేవంత్రెడ్డి
- ఆమె తల్లి చనిపోతే సీఎం కనీసం పరామర్శించరా?
- కొడుకుతో పంచాయితీ వల్లే గవర్నర్తో కేసీఆర్ కిరికిరి
- విద్య, వైద్యం, శాంతిభద్రతలపై సమీక్షించి చర్యలు తీసుకోవాలి
- కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి పోవడం చూస్తే రాష్ట్రంలో వైద్యం
- పడకేసినట్లే ఉంది: పీసీసీ చీఫ్
తనకు అవమానాలు ఎదురవుతున్నాయన్న గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు స్పందించాయి. గవర్నర్ పచ్చి బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని, వంద మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రభుత్వాన్ని కూల్చగలనని ఎలా అంటారని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. గవర్నర్ మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. విద్య, వైద్యం, శాంతిభద్రతల సమస్యలపై గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి సమీక్షించి చర్చలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం ఆలోచించే గవర్నర్ ను తప్పుపట్టుడేందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఏజెంట్లా గవర్నర్ ఉండాలని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్, గవర్నర్ ఇష్యూలో బీజేపీ జోక్యం చేసుకోదని చెప్పారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్పై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆమె మాటల్లో మానవీయ కోణం ఉందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ‘‘గవర్నర్ తమిళిసై తల్లి చనిపోతే సీఎం కేసీఆర్ పరామర్శించాల్సి ఉండె. భౌతికకాయాన్ని తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సి ఉండె. సీఎం కేసీఆర్ రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలి. కానీ ఆయనతెలంగాణ సంపద అంతా తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నరు” అని మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్లో రేవంత్ ప్రెస్మీట్లో, మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనతో అనేక కీలకాంశాలు చర్చకు వచ్చాయన్నారు. ‘‘కేటీఆర్ తనను సీఎం చేయాలంటూ కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నడు. దీన్ని తప్పించుకునేందుకు గవర్నర్ ఇష్యూను కేసీఆర్ సాకుగా చూపెడ్తున్నడు. గవర్నర్తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్ను సీఎం చేయడం కష్టమవుతుందని కుటుంబసభ్యులతో చెప్తూ వారికి నచ్చజెపుతున్నడు” అని అభిప్రాయపడ్డారు. కుటుంబ సమస్య నుంచి తప్పించుకునేందుకే రాజ్భవన్తో కేసీఆర్ గ్యాప్ పెంచుకున్నట్లు కనిపిస్తున్నదని ఆయన అన్నారు.‘‘కొడుకుతో పంచాయితీ వల్లే గవర్నర్తో కేసీఆర్ కిరికిరి పెట్టుకుంటున్నట్లు అర్థమైతున్నది” అని వ్యాఖ్యానించారు.
సర్కారు దవాఖాన్లలో పిల్లులు, ఎలుకల పెత్తనం
రాష్ట్రంలో వైద్యం పడకేసిందని గవర్నరే చెప్తున్నారని, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వైద్యం చేయించుకున్నారంటేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నదని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చెలాయిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గవర్నర్ గుర్తించారని, వాటిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయని, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సెక్షన్ 8 పరిధిలో అన్ని అంశాలను సమీక్షించే సర్వాధికారాలు రాజ్యాంగం గవర్నర్కు ఇచ్చిందని గుర్తుచేశారు. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై గవర్నర్ సమీక్షించి చర్యలు చేపట్టవచ్చన్నారు.
అంతేకాక దేశంలో ఏ గవర్నర్కు లేని అధికారాలు విభజన చట్టం వల్ల తెలంగాణ గవర్నర్కు ఉన్నాయని వివరించారు. గవర్నర్ బీజేపీ లీడర్లా మాట్లాడుతున్నారంటున్న టీఆర్ఎస్ నేతలకు గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆ ఇద్దరు కూడా అదే పార్టీకి చెందిన వారని గుర్తుకు రాలేదా అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రాజ్భవన్లో ఉగాది వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హాజరు కాలేదని, దీనిపైనా కేంద్రానికి గవర్నర్ ఫిర్యాదు చేస్తే బాగుండేదన్నారు. ఈ విషయాన్ని కూడా అమె చెప్పి ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉండేదని పేర్కొన్నారు. కిషన్రెడ్డి సిటీలో ఉండి కూడా హాజరు కాలేదని ఆయన అన్నారు. కేసీఆర్కు కోపం వస్తుందనే వీరిద్దరూ రాజ్భవన్కు వెళ్లలేదని రేవంత్ ఆరోపించారు.