గవర్నర్​ చెప్పింది కరెక్టే

గవర్నర్​ చెప్పింది కరెక్టే
  • తమిళిసై తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించాలి: రేవంత్​రెడ్డి
  • ఆమె తల్లి చనిపోతే సీఎం కనీసం పరామర్శించరా?
  • కొడుకుతో పంచాయితీ వల్లే గవర్నర్​తో కేసీఆర్​ కిరికిరి
  • విద్య, వైద్యం, శాంతిభద్రతలపై సమీక్షించి చర్యలు తీసుకోవాలి
  • కేసీఆర్​ వైద్యం కోసం ఢిల్లీకి పోవడం చూస్తే రాష్ట్రంలో వైద్యం 
  • పడకేసినట్లే ఉంది: పీసీసీ చీఫ్​

తనకు అవమానాలు ఎదురవుతున్నాయన్న గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు స్పందించాయి. గవర్నర్‌ పచ్చి బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని, వంద మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రభుత్వాన్ని కూల్చగలనని ఎలా అంటారని టీఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగింది. గవర్నర్​ మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. విద్య, వైద్యం, శాంతిభద్రతల సమస్యలపై గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించి సమీక్షించి చర్చలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం ఆలోచించే గవర్నర్ ను తప్పుపట్టుడేందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రశ్నించారు. టీఆర్​ఎస్​ ఏజెంట్​లా గవర్నర్​ ఉండాలని ఆ  పార్టీ లీడర్లు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్​, గవర్నర్‌  ఇష్యూలో బీజేపీ జోక్యం చేసుకోదని చెప్పారు. 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్​పై గవర్నర్​ తమిళిసై చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆమె మాటల్లో మానవీయ కోణం ఉందని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘గవర్నర్​ తమిళిసై తల్లి చనిపోతే సీఎం కేసీఆర్​ పరామర్శించాల్సి ఉండె. భౌతికకాయాన్ని తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సి ఉండె. సీఎం కేసీఆర్ రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలి. కానీ ఆయన​తెలంగాణ సంపద అంతా తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నరు” అని మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్​లో రేవంత్​  ప్రెస్​మీట్​లో, మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. గవర్నర్​ ఢిల్లీ పర్యటనతో అనేక కీలకాంశాలు చర్చకు వచ్చాయన్నారు. ‘‘కేటీఆర్​ తనను సీఎం చేయాలంటూ కేసీఆర్​ మీద ఒత్తిడి తెస్తున్నడు. దీన్ని తప్పించుకునేందుకు గవర్నర్​ ఇష్యూను కేసీఆర్​ సాకుగా చూపెడ్తున్నడు. గవర్నర్​తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్​ను సీఎం చేయడం కష్టమవుతుందని కుటుంబసభ్యులతో చెప్తూ వారికి నచ్చజెపుతున్నడు” అని అభిప్రాయపడ్డారు. కుటుంబ సమస్య నుంచి తప్పించుకునేందుకే రాజ్​భవన్​తో  కేసీఆర్​ గ్యాప్​ పెంచుకున్నట్లు కనిపిస్తున్నదని ఆయన అన్నారు.‘‘కొడుకుతో పంచాయితీ వల్లే గవర్నర్​తో కేసీఆర్​ కిరికిరి పెట్టుకుంటున్నట్లు అర్థమైతున్నది”  అని వ్యాఖ్యానించారు. 
సర్కారు దవాఖాన్లలో పిల్లులు, ఎలుకల పెత్తనం
రాష్ట్రంలో వైద్యం పడకేసిందని గవర్నరే చెప్తున్నారని, కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లి వైద్యం చేయించుకున్నారంటేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నదని  రేవంత్​ పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చెలాయిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గవర్నర్​  గుర్తించారని, వాటిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు గవర్నర్​కు ప్రత్యేక అధికారాలు ఉంటాయని, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సెక్షన్​ 8 పరిధిలో అన్ని అంశాలను సమీక్షించే సర్వాధికారాలు రాజ్యాంగం గవర్నర్​కు ఇచ్చిందని ​ గుర్తుచేశారు. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై గవర్నర్​ సమీక్షించి చర్యలు చేపట్టవచ్చన్నారు.

అంతేకాక దేశంలో ఏ గవర్నర్​కు లేని అధికారాలు విభజన చట్టం వల్ల తెలంగాణ గవర్నర్​కు ఉన్నాయని వివరించారు. గవర్నర్​ బీజేపీ లీడర్​లా మాట్లాడుతున్నారంటున్న టీఆర్​ఎస్​ నేతలకు గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆ ఇద్దరు  కూడా అదే పార్టీకి చెందిన వారని గుర్తుకు రాలేదా అని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. రాజ్​భవన్​లో ఉగాది వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కూడా హాజరు కాలేదని, దీనిపైనా కేంద్రానికి గవర్నర్​ ఫిర్యాదు చేస్తే బాగుండేదన్నారు. ఈ విషయాన్ని కూడా అమె చెప్పి ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉండేదని పేర్కొన్నారు. కిషన్​రెడ్డి సిటీలో ఉండి కూడా హాజరు కాలేదని ఆయన అన్నారు. కేసీఆర్​కు కోపం వస్తుందనే వీరిద్దరూ రాజ్​భవన్​కు వెళ్లలేదని రేవంత్​ ఆరోపించారు.