న్యూఢిల్లీ : దేశంలో బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్ ప్రొడక్షన్ పెంచేందుకు రూ. 13,760 కోట్ల ప్యాకేజ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 4 స్కీములను తెస్తున్నట్లు వెల్లడించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్ ఈ ప్యాకేజ్ను ఆమోదించింది. బల్క్ డ్రగ్స్ కోసం రూ. 9,940 కోట్లతో, మెడికల్ డివైసెస్ కోసం రూ. 3,820 కోట్లతో ప్యాకేజ్లను తయారు చేసినట్లు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో బల్క్ డ్రగ్స్ పార్కుల ఏర్పాటు కోసం రూ. 3 వేల కోట్లతో మరో స్కీమునూ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అలాంటి పార్కులలో కామన్ ఫెసిలిటీస్కు ఈ డబ్బును వెచ్చిస్తారని మంత్రి చెప్పారు. క్రిటికల్ స్టార్టింగ్ మెటీరియల్ (కేఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియెట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియెంట్స్ (ఏపీఐ) ఉత్పత్తిని దేశంలో పెంచేందుకు రూ. 6,940 కోట్ల ప్యాకేజ్ సాయపడుతుందని మాండవీయ వెల్లడించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీముగా దీనిని తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్కీము వల్ల రూ. 46,400 కోట్ల అదనపు అమ్మకాలు సాధ్యమవుతాయని, రాబోయే ఎనిమిదేళ్లలో చెప్పుకోగ్గ కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని మంత్రి చెప్పారు. రాష్ట్రాలతో కలిసి మూడు మెగా బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఒక్కో పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1,000 కోట్ల చొప్పున గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
53 క్రిటికల్ బల్క్ డ్రగ్స్ తయారీదారులకు ఇంక్రిమెంటల్ సేల్స్పై ఇన్సెంటివ్ను కూడా చెల్లించనున్నారు. 2019–20 ని ఇందుకోసం బేస్ ఇయర్గా తీసుకుంటారు. ఈ ఇన్సెంటివ్స్ను ఆరేళ్లపాటు చెల్లించనున్నారు. ఈ బల్క్ డ్రగ్స్లో 26 ఫెర్మెంటేషన్ బేస్డ్ కాగా, 27 కెమికల్ సింథసిస్ డేస్డ్ బల్క్ డ్రగ్స్. ఫెర్మెంటేషన్ బేస్డ్ బల్క్ డ్రగ్స్కు ఇంక్రిమెంటల్ సేల్స్లో 20 శాతాన్ని, కెమికల్ సింథసిస్ బేస్డ్ బల్క్ డ్రగ్స్కు ఇంక్రిమెంటల్ సేల్స్లో 10 శాతాన్ని ఇన్సెంటివ్గా చెల్లిస్తారు. మరోవైపు, మెడికల్ డివైసెస్ పార్కుల ఏర్పాటుకు ఒక్కో పార్కుకు రూ. 100 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా కేంద్రం ఇస్తుందని మాండవీయ తెలిపారు. దీంతో వచ్చే అయిదేళ్లలో మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ రూ. 68,437 కోట్లు పెరుగుతుందని, అదనంగా 33,750 ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో చైనా నుంచి బల్క్ డ్రగ్స్ దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం కలగడంతో, భవిష్యత్లో అలాంటి ముప్పు లేకుండా తాజా ప్యాకేజ్లను రూపొందించారు.
ఐతే, ఇప్పుడున్న కెపాసిటీని ముందు పూర్తిగా వినియోగించుకునేలా చొరవ తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. తాజా స్కీములో ఇంకా స్పష్టత లేదని, మరి కొన్ని వివరాలు తెలవాల్సి ఉందని ఐడీఎంఏ బల్క్డ్రగ్ కమిటీ హెడ్ యోగిన్ మజుందార్ తెలిపారు. ముందు ప్రస్తుతమున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలి. ఆ తర్వాత దీర్ఘకాలిక ప్లాన్ కింద, మూడేళ్లలో పార్కులను నెలకొల్పాలని మజుందార్ అభిప్రాయపడ్డారు. కెపాసిటీలో 40 శాతాన్ని అసలు వినియోగించడం లేదని పేర్కొన్నారు. ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్లోనూ కొన్ని మార్పులు అవసరమని, బల్క్ డ్రగ్స్ పరిశ్రమలకు అనుమతులు తొందరగా వచ్చేలా చూడాలని తెలిపారు. పరిశ్రమ ప్రొడక్షన్ పెరగకుండా ప్రధానంగా అడ్డుపడుతున్నవి పొల్యూషన్ నిబంధనలేనని, ఈ ప్యాకేజ్ల ప్రకటనలో వాటి ప్రస్తావనే లేదని వ్యాఖ్యానించారు.
తాజా ప్యాకేజ్ ప్రకటనతో దేశంలో మెడికల్ డివైసెస్ ప్రొడక్షన్ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ మెడికల్ డివైజెస్ కో ఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. మేకిన్ ఇండియాకు కొత్త ఊపు వస్తుందని అన్నారు. మెడికల్ డివైజెస్ అవసరాలలో 80-90 శాతం దిగుమతుల ద్వారానే నెరవేరుతున్నాయని, ఇందుకోసం రూ. 38,837 కోట్లను వెచ్చించాల్సి వస్తోందని వాపోయారు.