- ఇన్వెస్ట్మెంట్పై ఫ్యూచర్లో ఆలోచిస్తామన్న వారెన్ బఫెట్
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెర్క్షైర్ యాన్యువల్ మీటింగ్లో మొదటిసారిగా ఇండియన్ స్టాక్ మార్కెట్ పేరు వినిపించింది. బెర్క్షైర్ ఇండియన్ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తోందా? అనే ప్రశ్నకు సీనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ స్పందిచారు. ‘ఇండియన్ షేర్లు గత ఐదు, పది, 20 ఏళ్లలో మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. ఐదో పెద్ద ఎకానమీగా ఉన్న ఇండియా త్వరలో మూడో ప్లేస్కు చేరుకోబోతోంది.
నా ప్రశ్నేంటంటే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని బెర్క్షైర్ చూస్తోందా?’ అని యూఎస్ బేస్డ్ హెడ్జ్ ఫండ్ డూర్డార్షి అడ్వైజర్స్ రాజీవ్ అగర్వాల్ జనరల్ మీటింగ్లో వారెన్ బఫెట్ను అడిగారు. ఇండియా వంటి దేశాల్లో బోలెడు అవకాశాలు ఉంటాయని ఈ ప్రశ్నకు సమాధానంగా బఫెట్ పేర్కొన్నారు. బెర్క్షైర్ మేనేజ్మెంట్ దీని గురించి ఆలోచిస్తుందని అన్నారు. ఈ సంస్థ ఎక్కువగా యూఎస్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేసింది. కిందటేడాది ఐదు జపనీస్ ట్రేడింగ్ హౌస్లలో డబ్బులు పెట్టింది.
వీటి వాల్యుయేషన్ తక్కువగా ఉందని పేర్కొంది. వీటికి అదనంగా చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ బీవైడీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ‘ ఇండియాలో ఇంకా గుర్తించని బోలెడు అవకాశాలు ఉండొచ్చు. కానీ, వీటి గురించి ఫ్యూచర్లో ఆలోచిస్తాం’ అని బఫెట్ వివరించారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో బెర్క్షైర్కు లాభమా? అన్నదే ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇతరుల డబ్బులను మేనేజ్ చేస్తున్న వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలతో పోటీ ఉంటుందన్నారు. బెర్క్షైర్ దగ్గర సుమారు 200 బిలియన్ డాలర్ల క్యాష్ ఫ్లోస్ ఉన్నాయని అంచనా. ఈ కంపెనీ ఏదైనా కంపెనీలో మెజార్టీ వాటాలను కొనుగోలు చేయడం లేదా కంపెనీ మొత్తాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.