1,890 నర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

1,890 నర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • గత నోటిఫికేషన్‌‌కే యాడ్ చేస్తూ సర్కారు నిర్ణయం
  • 7,094కు పెరిగిన పోస్టుల సంఖ్య    

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 1,890 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌‌తోనే కలిపి ఈ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ఈ మేరకు శనివారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు పోస్టుల వివరాలను విడుదల చేసింది. గత సర్కార్ 2022 డిసెంబర్‌‌‌‌లో 5,204 స్టాఫ్ నర్స్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్ట్‌‌లో ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షను నిర్వహించగా, సుమారు 40 వేల మంది అటెండ్ అయ్యారు.

ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న మిగిలిన స్టాఫ్ నర్స్ పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్‌‌లో కలిపి భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు అప్పట్లోనే బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వాన్ని కోరినా, కన్సీడర్ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా బాధ్యతలు చేపట్టాక, నర్సింగ్ అసోసియేషన్లు ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి దృష్టికి ఆయన ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అధికారులతో చర్చించి మొత్తం పోస్టులను ఇదే నోటిఫికేషన్‌‌లో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.