టీఎస్​పీఎస్సీ యాక్టివ్ .. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు

టీఎస్​పీఎస్సీ యాక్టివ్ ..  వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు
  • టీఎస్​పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు
  • ఆగిన రిక్రూట్​మెంట్ ప్రక్రియల్లో కదలిక 

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ యాక్టివ్ అయింది. ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సర్కారు అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలనూ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే  గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. 

త్వరలోనే కమిషన్ తొలి భేటీ

కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో  టీఎస్​పీఎస్సీ చైర్మన్​ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించిన రెండ్రోజుల్లోనే కొత్త కమిషన్​కు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై రెండు వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి, చైర్మన్​ సహా ఐదుగురు సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్​గా  మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజినీ, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజూ సమీక్షలు, సమావేశాలతో కమిషన్ బిజీగా మారింది. గత కమిషన్ ఇచ్చిన నోటికేషన్లు ఎన్ని? ఎన్నింటి పరీక్షలు పూర్తయినయ్? రిజల్ట్ ప్రాసెస్ పూర్తయినవి ఎన్ని? ఏయే నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్నాయనే వివరాలపై చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషనన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే కమిషనన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో పలు పరీక్షల ఫలితాలు, పరీక్షల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఇంకెన్ని గ్రూప్ 1 పోస్టుల ఖాళీగున్నయ్!

గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 పోస్టులతో రిలీజ్ చేశారు. ఈ పరీక్షకు 3.80 లక్షల మంది అప్లై చేశారు. అయితే, రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా.. తొలిసారి పేపర్ లీక్ నేపథ్యంలో రద్దు కాగా, రెండోసారి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో టీఎస్​పీఎస్సీ కేసు వేసింది. అయితే, సర్కారు మారడంతో కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, ఈ నెల 31లోగా గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఈ మధ్యే ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు అన్ని డిపార్ట్​మెంట్లను ఆదేశించారు. దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశలు నిరుద్యోగుల్లో మొదలయ్యాయి.

పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికీ ర్యాంక్

స్టేట్​లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా, జులై1న పరీక్ష నిర్వహించారు. 9,51,205 మంది అప్లై చేయగా 7,62,872 మంది పేపర్ 1, 7,61,198 మంది పేపర్ 2 రాశారు.  5 నెలల కిందే ఫైనల్ కీ రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండటంతో, త్వరలోనే రిజల్ట్​ను ప్రకటించాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టు (జీఆర్ఎల్) ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించ నున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నా రు. ఈ నోటిఫికేషన్‌‌‌‌లో దాదాపు 99 శాఖల పోస్టులుండగా, వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లాస్థాయిలో, కొన్ని జోనల్‌‌‌‌ స్థాయిలో ఉన్నాయి.