అహ్మద్ పటేల్ కుట్రలో తీస్తా సెతల్వాద్ భాగమయ్యారు

అహ్మద్ పటేల్ కుట్రలో తీస్తా సెతల్వాద్ భాగమయ్యారు

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటీషన్ ను గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎం నరేంద్ర మోడీని ఇరికించేందుకు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ చేసిన కుట్రలో తీస్తా కూడా ఒక భాగమని పోలీసులు తమ ఆఫిడవిట్ లో పేరొన్నారు. గోద్రా అల్లర్ల తర్వాత అహ్మద్ పటేల్ ఆదేశానుసారం తీస్తా 30లక్షలు తీసుకున్నారని సిట్ ఆరోపించింది. ఈ కుట్రలో బీజేపీ సీనియర్ నేతలను చేర్చేందుకు అప్పట్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రముఖ జాతీయ పార్టీ నేతలను ఆమె కలిసేవారని సెషన్స్ కోర్టులో సిట్ అఫిడవిట్ దాఖలు చేసింది. సిట్ వాదనలు విన్న కోర్టు..బెయిల్ పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు. 


 
గుజరాత్ అల్లర్ల కేసులో మోడీ సహా బీజేపీ నేతలు, అమాయక ప్రజలను ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను రూపొందించారనే ఆరోపణలపై మాజీ ఐపీఎస్ అధికారులు శ్రీకుమార్, సంజీవ్ భట్ లతో పాటు తీస్తా సెతల్వాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మోడీకి సిట్ ఇచ్చిన  క్లీన్ చీట్ ను సుప్రీం కోర్టు సమర్ధించిన తర్వాత రోజే తీస్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సిట్ ఆరోపణలను ఖండించింది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానిని తప్పించే వ్యూహంలో ఇది భాగమని ఆరోపించింది. గుజరాత్ లో మారణహోమాన్ని నియంత్రించడానికి మోడీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంది. ఈ కేసులో మోడీకి క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత సిట్ చీఫ్ కు దౌత్య బాధ్యతలు ఎందుకు అప్పగించారో అందరికీ తెలుసని కాంగ్రెస్ విమర్శించింది.