హర్యానా: తొమ్మిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రాయితో కొట్టి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ దారుణం హర్యానాలో జరిగింది. గురుగ్రామ్కు చెందిన సోహిల్ అనే బాలుడు శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటుండగా ఎవరో కిడ్నాప్ చేశాడు. చట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మనేసర్లోని ఓ లిక్కర్ షాపు సమీపంలో బాలుడి మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం తర్వాత ఈ ఘటనలో ఘోరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఆ పసివాడిని తీవ్రంగా హింసించి చంపినట్లు తేలింది. ఆ చిన్నారి గుండెపై రాయితో కొట్టి హత్య చేశాడు ఆ కిడ్నాపర్.
కని వదిలేయడం కాదంటూ కుటుంబాన్ని తప్పుబట్టిన పోలీసులు
ఆ చిన్నారి కిడ్నాప్, హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ గుర్తు తెలియని దుండగుడు తొమ్మిదేళ్ల చిన్నారి సోహిల్ను తీసుకెళ్లడం సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించింది. దీని ఆధారంగా అతడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే కిడ్నాప్ అయిన విషయంపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినప్పడు పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని బాలుడి అంకుల్ చెబుతున్నాడు. ‘పిల్లల్ని కని రోడ్లపై వదిలేస్తారు. ఆ తర్వాత జరగరానిది ఏదైనా జరిగితే పోలీసుల దగ్గరకు పరిగెత్తుకు వస్తారు’ అంటూ ఏఎస్సై కశ్మీర్ సింగ్ కుటుంబసభ్యులను తిట్టాడని చెప్పాడు.