త్వరలోనే గురుకుల టైమింగ్స్ మార్పులు : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

త్వరలోనే గురుకుల టైమింగ్స్ మార్పులు : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల టైమింగ్స్ మార్చుతూ త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి చెప్పారు. గురువారం సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావును గురుకుల టీచర్లతో పాటు కలిసి వినతిపత్రం అందించారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి దీని గురించి విన్నవించామని చెప్పారు.

దీనికి అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, త్వరలోనే అన్ని గురుకులాల సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీనిచ్చినట్టు శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నియమించిన అధికారుల కమిటీ సమావేశంలో చర్చించిన ఆర్థికేతర అంశాలపై ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.