రెండో మ్యాచ్‌‌ను సైతం పేలవంగా ఆరంభించిన హైదరాబాద్

 రెండో మ్యాచ్‌‌ను సైతం పేలవంగా ఆరంభించిన హైదరాబాద్

ముంబై  457/3.. తేలిపోయిన హైదరాబాద్‌ బౌలర్లు

ముంబై: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌‌‌‌లో డ్రాతో గట్టెక్కిన హైదరాబాద్‌‌ రెండో మ్యాచ్‌‌ను సైతం పేలవంగా ఆరంభించింది. ముంబైతో మంగళవారం మొదలైన మ్యాచ్‌‌లో బౌలర్లు పూర్తిగా నిరాశ పరిచారు. దాంతో, టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ముంబై తొలి రోజే 457/3 స్కోరు చేసింది. యంగ్‌‌ స్టర్‌‌ యశస్వి జైస్వాల్‌‌ (162), కెప్టెన్‌‌ అజింక్యా రహానె (130 బ్యాటింగ్‌‌) సెంచరీలతో సత్తా చాటారు. సూర్యకుమార్‌‌ (90) కూడా మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం రహానెకు తోడు సర్ఫరాజ్‌‌ అహ్మద్‌‌ (40 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 

పృథ్వీ షా (19) ఫెయిలైనా మిగతా ప్లేయర్లంతా వన్డే స్టయిల్లో ఆడారు. ఓవర్‌‌కు 5 ప్లస్‌‌ రన్‌‌ రేట్‌‌తో హైదరాబాద్‌‌ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. రెండేళ్ల తర్వాత ఫస్ట్‌‌ క్లాస్​ క్రికెట్‌‌ ఆడుతున్న సూర్య 80 బాల్స్‌‌లోనే 90 కొట్టగా.. యశస్వి తన ఫామ్‌‌ కొనసాగించాడు. ఇక, టెస్టు టీమ్‌‌కు దూరమైన రహానె సెంచరీతో సెలక్టర్లను మెప్పించే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్‌‌ బౌలర్లలో శశాంక్ (2/87) రెండు, కార్తికేయ (1/70) ఒక వికెట్‌‌ తీయగా, మిగతా వారు భారీగా రన్స్‌‌ ఇచ్చుకున్నారు.