కేసీఆర్​ సీటుకు ఎసరు పెట్టింది.. హరీశ్​, కేటీఆరే

కేసీఆర్​ సీటుకు ఎసరు పెట్టింది..  హరీశ్​, కేటీఆరే
  • జమ్మికుంట దళిత మోర్చా సదస్సులో ఈటల రాజేందర్​ 
  • దళితులను అడుగడుగునా కేసీఆర్​ దగా చేస్తున్నరు
  • మేకల్లా కాదు.. పులుల్లా బతకాలని ప్రజలకు హితవు
  • 48 గంటల్లోగా అందరికీ దళితబంధు ఇయ్యాలని సర్కార్​కు డిమాండ్​ 

జమ్మికుంట, వెలుగు: రాష్ట్రం సాధించుకున్నప్పటి నుంచి దళితులను అడుగడుగునా సీఎం కేసీఆర్​ దగా చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్​ మండిపడ్డారు. కేసీఆర్​కు వాళ్ల ఓట్ల మీదున్న ప్రేమ.. వారి అభివృద్ధిపై లేదని విమర్శించారు. నచ్చనివారిని అణచేసి బయటకు వెళ్లగొట్టడం కేసీఆర్​కు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటుకు సూటిపెట్టేందుకు తాను ప్రయత్నించినట్టు హరీశ్​ ఆరోపిస్తున్నారని, కానీ, అసలు కేసీఆర్​ సీటుకు ఎసరు పెట్టింది హరీశ్​, కేటీఆరేనని అన్నారు. నోరెత్తితే అబద్ధాలు తప్ప.. ఎప్పుడూ నిజం చెప్పని కుటుంబం వారిదని ఆరోపించారు. గురువారం కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన దళిత మోర్చా సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి, కర్నాటక ఎంపీ మునుస్వామి, పార్టీ నేతలు బొడిగె శోభ, చంద్రశేఖర్​, బాబూమోహన్​ తదితరులు పాల్గొన్నారు. దళితుల సమస్యలపై కొట్లాడేందుకు తాను సిద్ధమని ఈటల అన్నారు. 
నా ప్రచారంలో డప్పు కొట్టినోళ్లకు..దళితబంధు ఇవ్వరట
హుజూరాబాద్​లో తనను ఓడిస్తే 20 ఏండ్ల పాటు తిరుగుండదని కేసీఆర్​ భావిస్తున్నారని ఈటల అన్నారు. తన ప్రచారంలో డప్పులు కొట్టేవాళ్లకు దళితబంధు ఇవ్వరంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది ఇప్పటికే ఉన్న పథకమని ఎన్నికల సంఘం ప్రకటించింది కాబట్టి.. 48 గంటల్లోగా దళితులందరికీ పథకాన్ని వర్తింపజేసి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఎన్నికలయ్యాక దీనిపై పోరాడుతానన్నారు. ఏదైనా కొట్లాడితేనే వస్తుందన్నారు. ‘బానిసత్వంలో మగ్గొద్దు.. నీ బాంచెన్​ అనొద్దు.. మేకల్లాగా కాదు.. పులి బిడ్డలా బతకాలె. మేకల్లా ఉంటే కోసుకుతింటరు. పులిబిడ్డలా ఉంటే భయపడిపోతరు’ అని చెప్పారు.
ఆరేండ్ల నరకం నుంచి బయటపడిన
ఐదారేండ్ల నుంచి టీఆర్ఎస్​లో నరకం అనుభవిస్తున్నానని, దాని నుంచి బయటపడ్డందుకు సంతోషంగా ఉందని ఈటల అన్నారు. తన లాంటి వాళ్లను బయటకు పంపించేందుకు 2018లోనే కేసీఆర్​ కుట్రలు పన్నారని ఆరోపించారు. తాను గొంతెత్తి మాట్లాడిన తర్వాతే హరీశ్​కు రెండోసారి మంత్రి పదవి దక్కిందన్నారు. పార్టీలో అవమానాలు జరిగిన మాట నిజమో..కాదో హరీశ్​ చెప్పాలని డిమాండ్​ చేశారు. పదవుల కోసం హరీశ్​ నోరు మూసుకుంటే.. తాను మాత్రం గొంతెత్తానని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ కేసీఆర్​ చెప్పింది నిజం కాదా అని ఈటల ప్రశ్నించారు. ఇద్దరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి తీసేశారని మండిపడ్డారు. 0.2 శాతం ఉన్న కేసీఆర్​ కులం వాళ్లకు ఎన్నో మంత్రి పదవులిచ్చారని, ఎస్సీల జనాభాకు తగ్గట్టు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వట్లేదని నిలదీశారు. ఏడేండ్లు ఒక్క దళిత ఆఫీసర్​ లేకుండా కేసీఆర్​ పాలన చేశారని, తాను మాట్లాడాకే ఒకరిని సీఎంవోలో నియమించారని గుర్తు చేశారు. ప్రదీప్​ చంద్ర అనే సీఎస్​ రిటైర్మెంట్​ ఫంక్షన్​కు కేసీఆర్​ రాలేదని, దళిత బిడ్డ కాబట్టే రాకుండా అవమానించారని ఆరోపించారు. దళితుల గురించి మాట్లాడినందుకే భూపాలపల్లి జిల్లా కలెక్టర్​గా ఉన్న ఆకునూరి మురళిని ట్రాన్స్​ఫర్​ చేశారని అన్నారు. కాగా, మైనారిటీల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని జమ్మికుంట స్వాతి గార్డెన్​లో జరిగిన మైనారిటీల సదస్సులో ఈటల అన్నారు. మైనారిటీబంధును ప్రవేశపెట్టి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు.  
కేసీఆర్​ పంచాంగం విప్పుత: బాబూమోహన్
ఈ నెల 15 తర్వాత సీఎం కేసీఆర్​ పంచాంగం చిట్టా విప్పుతానని బాబూమోహన్​ అన్నారు. కేసీఆర్​ కుటుంబమంతా దళిత వ్యతిరేకులేనని అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితుల్నిపోలీసులతో కేసీఆర్​ కొట్టించారని గుర్తు చేశారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​ గెలుపు కోసం దళితులంతా కృషి చేయాలని బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. కేసీఆర్​ దళిత ద్రోహి అని ఇప్పటికే ఎంతో మంది చెప్పారన్నారు. కేసీఆర్​జీవితమే అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. మోసాలు చేయడంలో రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంటారన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 మంది దళితులను కేబినెట్​లోకి తీసుకుందని, ఓ దళితవ్యక్తిని రాష్ట్రపతి చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్​ మాత్రం తన కేబినెట్​లో ఒక్కరికే అవకాశం ఇచ్చారన్నారు. తన కుటుంబంలోని వాళ్లకు మాత్రం 6 పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. టీటీడీ బోర్డులో కేసీఆర్​ కుటుంబం నుంచే ఆరుగురికి సభ్యులుగా అవకాశం ఇప్పించారని, ఒక్క దళితుడికైనా ఆ పదవి ఇప్పించలేదని మండిపడ్డారు. అప్పట్లో దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని, ఎకరాకు రూ.5 లక్షలు పెట్టి కొనిస్తానని చెప్పాడని, కానీ, ఇప్పుడేమో అసలు చెప్పలేదంటున్నారని వివేక్​ విమర్శించారు. దళితుల్లో ఎక్కువ మంది కౌలు రైతులేనని, కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో నష్టపోతున్న వాళ్లంతా కౌలురైతులేనని చెప్పారు. ఆనాడే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ.50 లక్షలు అయ్యి ఉండేదని, డబుల్​ బెడ్రూం ఇండ్లిస్తే రూ.15 లక్షలు అయ్యేదని అన్నారు. ఇప్పుడు దళితబంధు డబ్బులు వేసినట్టే వేసి అకౌంట్లను ఫ్రీజ్​ చేశారని ఆరోపించారు. కేసీఆర్​ ఎప్పుడైనా దళిత వ్యతిరేకేనని విమర్శించారు. ఈటల రాజేందర్​ను గెలిపిస్తే సీఎం కేసీఆర్​ దిగొచ్చి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాడని చెప్పారు. ఆ తర్వాత మైనారిటీల సదస్సులో పాల్గొన్న ఆయన.. మైనారిటీల శ్రేయస్సు కోసం పాటుపడతామని చెప్పారు. తన తండ్రి వెంకటస్వామి ఎప్పుడూ షేర్వాణీ వేసుకునేవారని గుర్తు చేశారు. తన కంపెనీల్లో మైనారిటీలకు చాలా అవకాశాలు కల్పించానని చెప్పారు.