కమలాపూర్, వెలుగు: హుజూరాబాద్ఉప ఎన్నికలో టీఆర్ఎస్ క్యాండిడేట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తే నియోజకవర్గానికి 5 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, కన్నూర్ గ్రామానికే 200 నుంచి -300 ఇండ్లు కట్టిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఆరోపించారు. మైకు పట్టుకొని మొసలి కన్నీరు కారుస్తూ ఓట్లడుగుతున్నారని విమర్శించారు. శనివారం కమలాపూర్ మండలంలోని గుండేడ్, కొత్తపల్లి, కన్నూర్ గ్రామాల్లో గెల్లు ప్రచారం చేశారు. కన్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధూంధాం సభలో హరీశ్ రావు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఓటేస్తరో లేక మాటల కోతల బీజేపీకి ఓటేస్తరో ప్రజలు చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే న్యాయం జరుగుతుందో లేక బీజేపీని గెలిపిస్తే జరుగుతుందో ఆలోచించాలన్నారు.
సంక్షేమ పథకాల అమలులో మనమే ఫస్ట్
రైతుల ఉసురుపోసుకుంటున్న బీజేపీ పార్టీలో ఈటల చేరారని హరీశ్ మండిపడ్డారు. కేసీఆర్ కుడి చేత్తో ఇస్తే బీజేపీ ఎడమ చేత్తో గుంజుకుంటోందన్నారు. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తూ మార్కెట్ వ్యవస్థను రద్దు చేయాలనుకుంటోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ ప్లేస్లో ఉందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు