గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే 5వేల డబుల్ ఇండ్లిస్తం

గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే 5వేల డబుల్ ఇండ్లిస్తం

కమలాపూర్, వెలుగు: హుజూరాబాద్​ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ గెల్లు శ్రీనివాస్​ యాదవ్​ను గెలిపిస్తే నియోజకవర్గానికి 5 వేల డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు ఇస్తామని, కన్నూర్​ గ్రామానికే 200 నుంచి -300 ఇండ్లు కట్టిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​రావు హామీ ఇచ్చారు. ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల రాజేందర్​ బీజేపీలో చేరారని ఆరోపించారు. మైకు పట్టుకొని మొసలి కన్నీరు కారుస్తూ ఓట్లడుగుతున్నారని విమర్శించారు. శనివారం కమలాపూర్​ మండలంలోని గుండేడ్, కొత్తపల్లి, కన్నూర్​ గ్రామాల్లో గెల్లు ప్రచారం చేశారు. కన్నూర్​ గ్రామంలో ఏర్పాటు చేసిన ధూంధాం సభలో హరీశ్​ రావు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఓటేస్తరో లేక మాటల కోతల బీజేపీకి ఓటేస్తరో ప్రజలు చెప్పాలని ​అన్నారు. టీఆర్​ఎస్​కు ఓటేస్తే న్యాయం జరుగుతుందో లేక బీజేపీని గెలిపిస్తే జరుగుతుందో ఆలోచించాలన్నారు. 

సంక్షేమ పథకాల అమలులో మనమే ఫస్ట్​

రైతుల ఉసురుపోసుకుంటున్న బీజేపీ పార్టీలో ఈటల చేరారని హరీశ్​ మండిపడ్డారు. కేసీఆర్​ కుడి చేత్తో ఇస్తే బీజేపీ ఎడమ చేత్తో గుంజుకుంటోందన్నారు. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తూ మార్కెట్​ వ్యవస్థను రద్దు చేయాలనుకుంటోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం నంబర్​ వన్​ ప్లేస్​లో ఉందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ బాల్క సుమన్, పాడి కౌశిక్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు