న్యూఢిల్లీ: మనదేశంలో స్మార్ట్వాచ్లను జనం తెగ కొంటున్నారు. ఈ విషయంలో మనం చైనాను దాటేశాం. భారతదేశం రెండవ అతిపెద్ద స్మార్ట్వాచ్ మార్కెట్గా అవతరించింది. 2022 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో డ్రాగన్ మార్కెట్ను అధిగమించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కన్జూమర్లు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురయ్యారని, అందుకే ఈ హెల్త్ డివైజ్లకు డిమాండ్ పెరిగిందని భారతీయ స్మార్ట్ వాచ్ కంపెనీలు భావిస్తున్నాయి. కన్జూమర్లలో ఆరోగ్య స్పృహ పెరగడం కరోనా తరువాత స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టే భారతదేశ స్మార్ట్వాచ్ మార్కెట్ సంవత్సరానికి 347 శాతానికి పైగా పెరిగింది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, ఫైర్-బోల్ట్, నాయిస్ వంటి భారతీయ బ్రాండ్లు కూడా గ్లోబల్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. ఉత్తర అమెరికా అతిపెద్ద స్మార్ట్వాచ్ మార్కెట్గా మొదటిస్థానంలో కొనసాగుతోంది. మునుపటి క్వార్టర్లో చైనా రెండవ స్థానంలో ఉంది. కోవిడ్ -19 లాక్డౌన్లు, ప్రతికూల ఆర్థిక గ్రోత్ కారణంగా డిమాండ్ తగ్గిపోవడంతో దాని ఎగుమతులు 10 శాతం పడిపోయాయి. దీంతో మూడవ స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో మూడో స్థానంలో ఉన్న యూరప్.. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమ్మకాలు 13 శాతం తగ్గి నాలుగో స్థానానికి పడిపోయింది.
అందుబాటు ధరలు..
"ఈ క్వార్టర్లో భారతీయ మార్కెట్లోకి రవాణాఅయిన వాటిలో 30 శాతం మోడల్స్ధర 50 డాలర్ల (దాదాపు రూ.4,500) కంటే తక్కువే! మేజర్ లోకల్ బ్రాండ్లన్నీ తక్కువ ధర మోడల్లను లాంచ్ చేశాయి. దీంతో గిరాకీ బాగుంది " అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ సుజియోంగ్ లిమ్ చెప్పారు. నాయిస్ 298 శాతం గ్రోత్ను రికార్డు చేసింది. ఇది భారతీయ మార్కెట్లో 26 శాతం వాటా సాధించింది. ఫైర్-బోల్ట్ క్వార్టర్లీ షిప్మెంట్ల విషయంలో మొదటి స్థానంలో ఉంది. కోవిడ్- తర్వాత కన్జూమర్లు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్మార్ట్వాచీల్లో హార్ట్రేట్, టెంపరేచర్, ఎస్పీఓ2, స్లీప్ మెజర్మెంట్ వంటి ఫీచర్లు ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయని కంపెనీలు అంటున్నాయి. " స్మార్ట్వాచ్లు ఆరోగ్యపరమైన పారామీటర్లను గుర్తించడంలో సహాయపడతాయి. వ్యక్తులు తమను తాము స్వయంగా పర్యవేక్షించుకోవడానికి ఉపకరిస్తాయి. ఈ డివైజ్లు సేకరించే డేటా డాక్టర్లు ట్రీట్మెంట్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఎంతమాత్రం లగ్జరీ ప్రొడక్టులు కావు. అందరూ కొనుక్కోవచ్చు ”అని గూకీ ఫౌండర్ & సీఈఓ విశాల్ గొండల్ అన్నారు.
గ్లోబల్గా ఆపిల్ నెం.1
తక్కువ ధరలకు రావడమే గాక వీటిని ధరించడం ఫ్యాషన్గానూ మారడంతో స్మార్ట్వాచీల అమ్మకాలు స్పీడ్గా పెరుగుతున్నాయి. “స్మార్ట్ వాచ్ మరింత అఫోర్డబుల్గా మారుతోంది. భారతీయ కన్జూమర్లలో స్మార్ట్వాచ్కి భారీ డిమాండ్, ఆసక్తి పెరగడానికి చౌకధరలు, ఫ్యాషన్.. రెండు అతిపెద్ద కారకాలు”అని ప్లే కో–ఫౌండర్ వికాస్ జైన్ అన్నారు. ‘‘గత కొన్ని క్వార్టర్లలో వేరబుల్ మార్కెట్లలో ఇండియా బ్రాండ్లు తమ సత్తా చాటుతున్నాయి. గ్లోబల్ వేరబుల్స్ ఇండస్ట్రీలో భారీ వాటా దక్కించుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో వచ్చిన ఐడీసీ లెక్కల ప్రకారం నాయిస్ నంబర్ 1 స్మార్ట్వాచ్ బ్రాండ్గా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 స్మార్ట్వాచ్ బ్రాండ్లలో మేమూ ఉన్నాం” అని నాయిస్ కో–ఫౌండర్గౌరవ్ ఖత్రి అన్నారు. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఇటీవల ప్రచురించిన గ్లోబల్ స్మార్ట్వాచ్ మోడల్ ట్రాకర్ ప్రకారం, ఇన్ఫ్లేషన్, యుద్ధం వంటి సమస్యలు ఉన్నప్పటికీ గ్లోబల్గా స్మార్ట్వాచ్ మార్కెట్ ఎగుమతులు 13 శాతం పెరిగాయి. యాపిల్ గ్లోబల్ స్మార్ట్వాచ్ మార్కెట్లో తన వాటాను మరో 8 శాతం పెంచుకొని మొదటిస్థానాన్ని నిలుపుకుంది. మొత్తం షిప్మెంట్లలో 29.3 శాతం వాటాను సాధించింది. శామ్సంగ్ 40 శాతం ఏడాది గ్రోత్సాధించింది. మొత్తం షిప్మెంట్లలో 9.2 శాతంతో రెండవ స్థానాన్ని కొనసాగించింది.