యాదాద్రికి 2 రోజుల్లో విరాళంగా 33 కిలోల బంగారం

యాదాద్రికి 2 రోజుల్లో విరాళంగా 33 కిలోల బంగారం
  • భారీగా విరాళాలు ప్రకటిస్తున్నకాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు
  • 6 కిలోల గోల్డ్​ ఇస్తామన్న మేఘా ఇంజనీరింగ్​ కంపెనీ
  • తలా 2 కిలోలు ఇస్తామన్న కేఎన్​ఆర్​ కన్​స్ట్రక్షన్స్, ప్రణీత్​ గ్రూప్​
  • జలవిహార్​ ఎండీ తరఫున ఒక కిలో
  • రెండు రోజుల్లో విరాళంగా వచ్చిన బంగారం 33 కిలోల 16 తులాలు

హైదరాబాద్​/యాదగిరి గుట్ట, వెలుగు: యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని ఇస్తున్నారు. విరాళాలు ప్రకటించడంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌ ఉండే  కాంట్రాక్టు, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కాళేశ్వరం సహా అనేక కీలక ప్రాజెక్టులు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థ 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ పుణ్యకార్యంలో పాలుపంచుకోవడం తమకు ఎంతో గౌరవప్రదమని సంస్థ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆలోచనాత్మక రూపకల్పనలో యాదాద్రి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందన్నారు.

ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, రోడ్లు, హైవేల పనులు చేస్తున్న కేఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఎండీ కామిడి నర్సింహారెడ్డి 2 కేజీల బంగారం విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే ప్రణీత్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఎండీ నరేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌ కామరాజు 2 కిలోల బంగారం ఇస్తామని పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, జలవిహార్‌‌‌‌‌‌‌‌ ఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌వీ రామరాజు కిలో బంగారం ప్రకటించారు. కరోనా టైంలో వేల కోట్ల మందుల వ్యాపారం చేసిన హెటిరో గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కంపెనీస్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే 5 కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అత్యంత సన్నిహితుడైన కావేరి సీడ్స్‌‌‌‌‌‌‌‌ యజమాని భాస్కర్‌‌‌‌‌‌‌‌ రావు కిలో బంగారం ఇస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో నిత్యం టచ్‌‌‌‌‌‌‌‌లో ఉండే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తామని, ఇందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మంగళవారం యాదాద్రిలో పిలుపునిచ్చారు. తన కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఎం పిలుపుతో వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, ప్రజాప్రతినిధులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే  22 కిలోల 16 తులాల బంగారం విరాళంగా రాగా,  బుధవారం 11 కిలోలు వచ్చాయి.  మొత్తంగా రెండు రోజుల్లో 33 కిలోల 16 తులాల బంగారం 
సమకూరింది.
విరాళాల కోసం ప్రత్యేక అకౌంట్
విరాళాల సేకరణ కోసం యాదాద్రి ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్ ను తీసుకొచ్చారు. దీన్ని బుధవారం టెంపుల్ ఈవో గీతారెడ్డి విడుదల చేశారు. ప్రజలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసేందుకు వీలుగా అకౌంట్ నంబర్ తో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ ను రిలీజ్ చేశారు. యాదగిరిగుట్టలోని ఇండియన్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ నంబర్ 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDIB000Y011 ను అందుబాటులోకి 
తెచ్చారు.