హైదరాబాద్ సిటీలో ఇవాళ ( బుధవారం, ఆగస్ట్ 5, 2026) సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, బషీర్ బాగ్ , అబిడ్స్, నారాయణగూడ , హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా సాయంత్రం 5 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో.. ఆఫీస్ల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నరకయాతన అనుభవించారు. ఐటీ కారిడార్ ఏరియాలో వర్షం పడితే ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సేమ్ సీన్ కనిపించింది. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఐటీ ఉద్యోగుల కార్లు, బైక్స్, క్యాబ్లతో రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్ నెలకొంది. కొన్ని చోట్ల నీళ్లు నిలిచిపోవడంతో GHMC, హైడ్రా రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్ సిటీలో రెండు గంటల పాటు భారీ వర్షం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షంతో నగర వాసులు కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. అత్యవసరం అయితే తప్ప అడుగు బయటపెట్టొద్దని పోలీసులు సూచించారు.
వర్షాలు కురిసిన ప్రతిసారీ సిటీ రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాన కూడళ్ల నుంచి అంతర్గత రోడ్ల వరకు ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.
వర్షపు నీటితో గుంతలు కనిపించక వాహనాలు ఒక్కసారిగా అదుపు తప్పుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.
