జోరు వాన.. నిండు గర్భిణి అష్టకష్టాలు

జోరు వాన.. నిండు గర్భిణి అష్టకష్టాలు

ఆస్పత్రికి వెళ్లేందుకు అడుగడుగునా అడ్డంకులు

దహెగాం : నెలలు నిండిన గర్భిణి నాలుగు గంటలు నరకయాతన అనుభవించింది. ఇంటి నుంచి ఆస్పత్రికి చేరుకునే దాకా అడుగడుగునా అడ్డంకులను ఎదుర్కొన్నది. రోడ్డు తెగిపోయి.. చెట్టు కూలి.. ముందుకు వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొన్నది. పురిటినొప్పులను పంటిబిగువున భరించిన ఆడబిడ్డ.. బంధువులు, గ్రామస్తులు, పోలీసుల సాయంతో ఆస్పత్రికి చేరుకుంది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని చిన్న రాస్పల్లికి చెందిన కామేరే విజయ తొలి కాన్పు కోసం అదే మండలం మొట్లగూడలోని పుట్టింటికి వెళ్లింది. డాక్టర్లు ఆమెకు ఈ నెల 15న డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ మంగళవారం సాయంత్రమే విజయకు పురటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆశ వర్కర్‌‌‌‌తో కలిసి టాటా ఏస్ వాహనంలో 30 కిలోమీటర్ల దూరంలోని దహెగాం పీహెచ్‌‌సీకి బయల్దేరారు. ఆరు కిలోమీటర్లు రాగానే భారీ వర్షానికి రోడ్డు తెగిపోయి కనిపించింది. దీంతో గర్భిణిని అతికష్టం మీద కొద్ది దూరం నడిపించుకుంటూ తీసుకొచ్చి అటువైపు ఉన్న వేరే ఆటోలో బయల్దేరారు.

మరో ఏడు కిలోమీటర్లు వచ్చేసరికి భారీ వర్షాల వల్ల రాంపూర్ అడవుల్లో పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డుగా పడిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ సనత్ కుమార్ రెడ్డి వెంటనే అక్కడకు చేరుకుని చెట్లను తొలగించారు. ఆటోలో హస్పిటల్‌‌కు తరలించేందుకు ప్రయత్నించారు. మరో 15 కిలోమీటర్లు వెళ్లే సరికి ఒడ్డుగూడ వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఆటోను వెనక్కి తిప్పి, మరో రూట్‌‌లో పికలగుండం మీదుగా వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ లోలెవల్ వంతెన రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. దీంతో తప్పేది లేక స్ట్రెచర్ మీద గర్భిణిని అటువైపుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అంబులెన్స్‌‌లో దహెగాం పీహెచ్‌‌సీకి తరలించారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న హాస్పిటల్ సిబ్బంది.. విజయకు పురుడు పోశారు. ఆడ శిశువుకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.