హైదరాబాద్, వెలుగు: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారి ఏపీ తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉందని చెప్పింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం జనగామ జిల్లా కూనూరులో 6 సెం.మీ. వర్షం కురిసింది.