హైదరాబాద్: ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై కమిటీ వేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది. చిత్రం విడుదలపై కమిటీ వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
గతంలో ఇలాంటి అంశంలోనే బాంబే హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిందని హైకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. అలాంటి కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నామని, సభ్యులను ఇరువైపులా న్యాయవాదులు కలిసి ఎంచుకోవాలని సూచించింది. ఏర్పాటు చేసిన కమిటీకి వ్యూహం సినిమాను చూపించాలని.. కమిటీ రిపోర్ట్ను శుక్రవారంలోపు హైకోర్ట్కు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని చెబుతోంది.
ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 11కు బదులు 8న విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది. మెరిట్స్ ఆధారంగా ఈనెల 8న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వేసిన పిటిషన్పై నిన్నహైకోర్టులో విచారణకు రాగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్తో పాటు రికార్డ్స్ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. అయితే సెన్సార్ బోర్డు ఇచ్చిన రికార్డులను చూసిన అనంతరం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.