
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు చెప్పనుంది. గత ఏడాదిన్నరకాలంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలను ముగించింది.
లోకల్ బాడీ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ నల్లగొండ జిల్లా మల్లేపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీగూడెం సర్పంచ్ మురళీధర్ ఈ పిటిషన్లను వేశారు. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఫైనలైజ్ చేసేందుకు తమకు 30 రోజుల గడువు కావాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రం ట్రిపుల్ టెస్ట్ విధానంలో చర్యలు తీసుకుంటున్నందున సమయం కావాలని తెలిపింది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్ అధ్యయనం కూడా ముగిసిందని విన్నవించింది. బీసీ రిజర్వేషన్లను ఫైనలైజ్ చేయడమే తరువాయి అని చెప్పింది.
అయితే, ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని, రాజ్యాంగంలోని 243ఈ, 243కే ఆర్టికల్స్, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు బుధవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది.