- ఇందుకోసం అత్యాధునిక బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్
- వెల్లడించిన పరిశ్రమల శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు భారీ ప్రాజెక్టును చేపడుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ‘డిజిటల్ తెలంగాణ’ కలను నెరవేర్చడానికి టీఫైబర్ అత్యాధునిక బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ వివరించారు. మొత్తం 33 జిల్లాల్లోని 12,751 గ్రామ పంచాయితీల్లోగల 83.58 లక్షల ఇండ్లకు చాలా తక్కువ రేట్లకే నెట్ అందిస్తామని వెల్లడించారు. ఇండ్లకు అయితే నెట్స్పీడ్ 4–-100 ఎంబీపీఎస్ వరకు ఉండొచ్చని. సంస్థలకు అయితే 20-–100 ఎంబీపీఎస్ స్పీడుతో నెట్ ఇస్తామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో సీఐఐ తెలంగాణ హైదరాబాద్లో శుక్రవారం ‘మేక్ ఇన్ తెలంగాణ-స్టేట్ విత్ ఇన్ఫినిట్ అపోర్చునిటీస్’ పేరుతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ర్యాంకింగ్స్లో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉందని, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటని అన్నారు. ‘‘సిటీని దేశానికి స్టార్టప్ రాజధానిగా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం టీ-హబ్ను ప్రారంభించింది. మనదేశంలోనే ఇది అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్. టీహబ్లో ఇంక్యుబేట్ అయిన మూడు స్టార్టప్ల నుండి నలుగురు హైదరాబాద్ పారిశ్రామికవేత్తలు ‘ఫోర్బ్స్ అండర్ 30’లో చోటు సంపాదించారు’’ అని వివరించారు. డీఆర్ఎల్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లైఫ్ సైన్స్ రంగం మూడు రెట్లు గ్రోత్ సాధించగలుగుతుందన్నారు.