- మరో ఇద్దర్ని కాల్చిచంపిన సెక్యూరిటీ
- టెర్రరిస్ట్ ఫ్రీగా దొడా జిల్లా
- ప్రకటించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ మేరకు సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. హిజ్బుల్ ముజాహిద్దిన్ కమాండర్ మసూబ్ అహ్మద్భట్ను పోలీసులు మట్టుబెట్టారు. దీంతో ఇప్పుడు జమ్మూకాశ్మీర్లోని దొడా జిల్లా టెర్రరిస్ట్ ఫ్రీ అయిందని, అక్కడ టెర్రరిస్టులు ఎవరూ లేరని పోలీసులు ప్రకటించారు. టెర్రరిస్టులు దాగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని అన్నారు. సంఘటనా స్థలంలో ఏకే47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. “ ఖుల్ చోహార్ అనంత్నాగ్లో పోలీసులు, లోకల్ ఆర్ఆర్ యూనిట్లు జరిపిన ఆపరేషన్లో ఇద్దరు లష్కరే టెర్రరిస్టులు, కమాండర్ మసూద్ను మట్టుబెట్టారు. జమ్మూజోన్లోని దొడా జిల్లా ఇప్పుడు టెర్రరిస్ట్ ఫ్రీ” అని అనంత్నాగ్ పోలీసులు ట్వీట్ చేశారు. రేప్ కేసులో నిందితుడైన మసూద్ చాలా కాలం క్రితం తప్పించుకుని పోయి.. టెర్రరిస్టుల్లో చేరాడని అన్నారు. అతను చాలా కుసుల్లో నిందితుడని చెప్పారు. జమ్మూకాశ్మీర్లో దాదాపు 29 మంది ఫారెన్ టెరరిస్టులు యాక్టివ్గా ఉన్నారని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు ప్రకటించారు.