కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆస్పత్రి నుంచి సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన డిశ్చార్జ్ అయిన విషయాన్ని ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. డిశ్చార్జ్ అయిన వెంటనే షాకు టెస్టులు నిర్వహించగా నెగిటివ్ గా తేలింది. ఈనెల 2న కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. ఈనెల 14న ఆయనకు నెగిటివ్ గా తేలింది. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అయితే పలు అనారోగ్య సమస్యలు తిరగబెట్టడంతో మెడికల్ కేర్ కోసం ఈ నెల 18న షాను ఎయిమ్స్ లో చేర్చారు. ‘గత మూడు రోజులుగా హోం మినిస్టర్ అమిత్ షా అలసట, శరీర నొప్పులతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా నెగిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆస్పత్రి నుంచే షా తన పనిని కొనసాగించారు’ అని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. షా ఆరోగ్యాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా దగ్గరుండి పర్యవేక్షించారు.