బ్యాలెన్స్​ ఆఫ్​పేమెంట్స్​

బ్యాలెన్స్​ ఆఫ్​పేమెంట్స్​

ఒక నిర్ణీతకాలంలో ఒక దేశ ప్రజలు ప్రపంచ దేశాలతో జరిపే అన్నిరకాల కార్యకలాపాలను డబుల్​ ఎంట్రీలో నమోదు చేసే పట్టికే బ్యాలెన్స్​ ఆఫ్​ పేమెంట్స్​. వస్తు ఎగుమతులు, అందించిన సేవలకు రాబడులు, దేశీయులు పొందిన మూలధన రాబడులు రాబడి వర్గంలోనూ వస్తు దిగుమతులకు చెల్లింపులు ఇతర దేశాల నుంచి పొందిన సేవల చెల్లింపులు, విదేశీయులకు బదిలీ చేసిన మూలధనం చెల్లింపు వర్గంలోకీ వస్తాయి. కేవలం వస్తువుల ఎగుమతులు, దిగుమతుల గురించి తెలియజేసేది బ్యాలెన్స్​ ఆఫ్​ ట్రేడ్​. అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలను తెలియజేసేది బీఓపీ. ఇందులో రెండు ఖాతాలు ఉంటాయి. 

అవి.. ఎ. కరెంట్​ ఖాతా బి. మూలధన ఖాతా.

వస్తువులు, సేవలు, ఆదాయం కరెంట్​ ఖాతాకు సంబంధించినవి. క్లెయిమ్​లు, లైబిలిటీలు, కరెంట్​ ఖాతా లోటు లేదా మిగులు భర్తీ అంశాలు మూలధన ఖాతాకు చెంది ఉంటాయి. ఈ కరెంట్, మూలధన ఖాతా వ్యవహారాలు రెండూ కలిసి బేసిక్​ బ్యాలెన్సును చూపుతాయి. ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ బీఓపీ మాన్యువల్​ ప్రకారం వస్తువుల ఎగుమతులు, దిగుమతులను ఫ్రీ ఆన్​ బోర్డ్​ (రవాణా, బీమా వ్యయం కలపకుండా ప్రకటిస్తారు. కారణం వీటిని అదృశ్యం అంశాల్లో లెక్కిస్తారు.) పద్ధతిలో ప్రకటిస్తారు. అయితే, మన దేశంలో సమాచార అడ్డంకుల వల్ల దిగుమతులను కాస్ట్​ ఇన్సూరెన్స్​ అండ్​ ఫ్రైట్​ ప్రాతిపదికన, ఎగుమతులను ఫ్రీ ఆన్​ బోర్డ్​ ప్రాతిపదికన ప్రకటిస్తారు. 

కరెంట్​ ఖాతా: ఇందులో మూడు అంశాలు ఉంటాయి. అవి.. 1. దృశ్యాంశాలు, 2. అదృశ్యాంశాలు, 3. ఏకపక్ష బదిలీలు.
దృశ్యాంశాలు: వస్తువుల ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన అంశాలు దృశ్యాంశాలు. వస్తువుల ఎగుమతి, దిగుమతుల నమోదును తెలియజేసేది వ్యాపార శేషం. ఇందులో వస్తువులు మాత్రమే చూపుతారు. బ్యాలెన్స్​ ఆఫ్​ ట్రేడ్​ మూడు రకాలుగా ఉండవచ్చు. 
– వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సమానమైతే వర్తక శేషం సమతౌల్యం.
– దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటే వర్తక శేషం మిగులు. వర్తకపు మిగులునే అనుకూల వర్తక శేషం అంటారు.
– ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైతే వర్తకం శేషం లోటు. వర్తకపు లోటునే ప్రతికూల వర్తక శేషం అంటారు. 

అదృశ్యాంశాలు: ఒక దేశం మరో దేశానికి అందించే, స్వీకరించే సేవలు అదృశ్య అంశాలు. ఉదా: బ్యాంకింగ్​, బీమా, రవాణా, యాత్రికుల సేవలు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, దౌత్య కార్యాలయాలపై వ్యయం, వడ్డీ లాభాలు, డివిడెండ్లు మొదలైనవి. ఒక దేశం మరో దేశానికి సేవలందిస్తే రాబడిగాను, ఇతర దేశాల నుంచి పొందితే చెల్లింపులుగాను నమోదు చేస్తారు. 
మూలధన ఖాతా: వర్తమాన ఖాతాలోని మిగులు, లోటులను మూలధన ఖాతాల లావాదేవీల ద్వారా పూరిస్తారు. మూలధన ఖాతాలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, 
పోర్టుపోలియో పెట్టుబడులు, విదేశీ దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ విత్త సంస్థలు అందించే అభివృద్ధి సహాయం, బంగారం క్రయవిక్రయాలు, విదేశీ సెక్యూరిటీల కొనుగోళ్లు, అమ్మకాలు, విదేశీ మారకద్రవ్య చలానాలు మొదలైన అంశాలు భాగాలుగా ఉంటాయి. 

ఏకపక్ష బదిలీలు: ఒక దేశం నుంచి మరో దేశానికి ఏకపక్ష బదిలీలు ఉంటాయి. ఉదా: కానుకలు, గ్రాంట్లు, విరాళాలు, నష్టపరిహారాలు, దానాలు, మానవతా చెల్లింపులు, అభివృద్ధి ఎయిడ్​ మొదలైనవి. ఇవి విదేశాల నుంచి వస్తే రాబడిగాను, ఇతర దేశాలకు ఇస్తే చెల్లింపుగాను చూపుతారు. ఇవి రెండు రకాలు. ఎ. ప్రైవేట్​ బదిలీలు, బి. ప్రభుత్వ బదిలీలు.

ఒక దేశీయులు విదేశాల్లో ఉంటూ తమ దేశానికి పంపించేవి ప్రైవేట్​ బదిలీలు. ఉదా: అమెరికాలో ఉంటున్న భారతీయులు తమ కుటుంబీకులకే పంపించే ద్రవ్యం. 
ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి గ్రాంట్లు, బహుమతులు, నష్టపరిహారాలు ఇవ్వొచ్చు. వీటిని ప్రభుత్వ బదిలీలు అంటారు. 

వర్తమాన లావాదేవీలు సాధారణంగా ఒక సంవత్సరానికి లెక్కిస్తారు. కరెంట్​ ఖాతాలోని లావాదేవీలు, ఆ దేశ సంపాదనా సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. వర్తమాన చెల్లింపుల కంటే వర్తమాన రాబడి ఎక్కువగా ఉంటే, ఆ దేశ సంపాదనా సామర్థ్యం ఎక్కువగా ఉందని గ్రహించాలి. అలా కాకుండా ఆ దేశ వర్తమాన రాబడుల కంటే వర్తమాన చెల్లింపులు ఎక్కువగా ఉంటే ఆ దేశ సంపాదనా సామర్థ్యం తక్కువగా ఉందని గ్రహించాలి. వస్తువులు, సేవలు, ఏకపక్ష బదిలీల ఎగుమతులు, దిగుమతులకు చెందినదే కరెంట్​ ఖాతా. ఈ మూడు అంశాల ఎగుమతుల విలువ దిగుమతుల కంటే ఎక్కువైతే కరెంట్​ ఖాతాలో మిగులు ఉందని అర్థం.

బీఓపీలో సమతౌల్యం

కరెంట్​ ఖాతాలో లోటు ఏర్పడితే మూలధన ఖాతాలో మిగులు చూపడం ద్వారా కరెంట్​ ఖాతాలో మిగులు ఏర్పడితే మూలధన ఖాతాలో లోటు చూపడం ద్వారా బీఓపీలో ఎల్లప్పుడూ అకౌంటింగ్​ దృష్ట్యా సమతౌల్యం ఉంటుంది. అందుకే ఇది దేశ ఆర్థిక వాస్తవ స్థితిని తెలియజేదు. అందువల్ల బీఓపీలో లోటు అంటే కరెంట్​ ఖాతాలో లోటునే పేర్కొంటారు. బీఓపీని డబుల్​ ఎంట్రీ సిస్టమ్​లో నమోదు చేస్తారు. కాబట్టి రాబడులు, చెల్లింపులు సమానంగా ఉంటాయి. అంటే దేశం బీఓపీ సమస్యను ఎదుర్కోదు అని అర్థం కాదు. ఒక దేశం కరెంట్​ ఖాతా లోటును కలిగి ఉంటే విదేశాల నుంచి అప్పు తెచ్చుకోవడం ద్వారా భర్తీ చేస్తారు. ఈ పరిస్థితి తరుచూ పునరావృతమైతే బీఓపీ సమస్య తీవ్రమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్​లో అధిక వడ్డీ రేటుకు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది.

అసమతౌల్యంలోని రకాలు: విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతౌల్యం అనేక రకాలు ఉంటుంది. అవి.. 1. తాత్కాలిక, 2. చక్రీయ, 3. దీర్ఘకాలిక, 4. నిర్మాణాత్మక, 5. ప్రాథమిక అసమతౌల్యాలు. 

    స్వల్పకాలిక లేదా తాత్కాలిక కారణాల వల్ల ఎగుమతులు లేదా దిగుమతుల్లో
    వచ్చే ఆకస్మిక మార్పుల వల్ల తాత్కాలిక అసమౌతల్యం ఏర్పడుతుంది. పంటలు విఫలమవడం, క్షామాలు లేదా రుతుపవన సంబంధమైన మార్పుల వల్ల ఏర్పడవచ్చు. 

    క్రమంగా సంభవించే వ్యాపార చక్రాలు ఆదాయ పెరుగుదలకు లేదా క్షీణతకు దారి తీస్తాయి. దిగుమతులు పెరగడం లేదా ఎగుమతులు తగ్గడం వల్ల విదేశీ చెల్లింపుల్లో అసమతౌల్యం సంభవించి చక్రీయ అసమతౌల్యం ఏర్పడుతుంది. 

    దీర్ఘకాలంలో లోటు లేదా మిగులు సంభవించినట్లయితే దీర్ఘకాలిక లేదా సెక్యులర్​ అసమతౌల్యంగా వ్యవహరిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధిని సాధించాలనుకున్నప్పుడు 15 – 20 సంవత్సరాల కాలంపాటు ఎగుమతుల కంటే దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు గడిచిన 65 సంవత్సరాల్లో భారతదేశం చెల్లింపు శేషం దీర్ఘకాలిక లోటును అనుభవిస్తుంది. 

    ప్రజల అభిరుచుల్లో మార్పులు లేదా ఉత్పత్తి పద్ధతులు ఆధునికీకరించిన ప్పుడు నిర్మాణాత్మక అసమతౌల్యం ఏర్పడుతుంది.
    ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు లేదా మిగులు దీర్ఘకాలంలో కూడా కొనసాగితే దానిని ప్రాథమిక అసమతౌల్యం అంటారు.