త్వరలో పీసీసీలో భారీ మార్పులు

త్వరలో పీసీసీలో భారీ మార్పులు

ముందు రాష్ట్ర ఇంచార్జి మార్పు

సీడబ్ల్యూసీ నిర్ణయాలతో యూత్నేతల్లో జోష్

బయట నుంచి వచ్చిన వాళ్లకు చెక్ పెడతారని చర్చ

మీటింగ్ పరిణామాలపై ఫోకస్

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ పీసీసీలో త్వరలో భారీ మార్పుల దిశగా పరిణామాలు సాగుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం తీర్మానాలు దీనినే బలపరుస్తున్నాయని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ పరిణామాలను రాష్ట్ర నేతలు ఉదయం నుంచి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. మీటింగ్ తీర్మానాలను మీడియాకు విడుదల చేశారు. ఇందులోని అంశాలతోపాటు సమావేశం జరిగిన తీరుపై రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండి తెలుసుకున్నారు.

కొందరు నేతలను ‘వెలుగు’ పలకరించగా పలు విషయాలను వెల్లడించారు. నేతల లేఖకు అనుగుణంగానే.. పార్టీకి డైనమిక్‌, యాక్టివ్‌ నేతలు నాయకత్వం వహించాలని 23 మంది కాంగ్రెస్‌ పెద్దలు రాసిన లెటర్‌‌కు అనుగుణంగానే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మార్పులు చేసేందుకు సర్వాధికారాలను సోనియా, రాహుల్‌ గాంధీల చేతిలో పెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇన్ని రోజులుగా ప్రక్షాళనకు అడ్డుపడుతూ వస్తున్న నేతలు, ముఖ్యంగా సీనియర్లకు, ఇకపై ఆ అవకాశం లేకుండా పోతుంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వాళ్లకే అవకాశాలు దక్కుతాయని సంతోషంతో ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు చెక్‌ పడుతుందని సంబరపడుతున్నారు.

రేవంత్ పై కొనసాగుతున్న ప్రచారం..

రాష్ట్రంలో పీసీసీ మార్పు గురించి ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. తాను బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఎన్నికల తర్వాత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఏఐసీసీకి లేఖ రాశారు. కానీ పలు కారణాలతో అధిష్టానం ఆయననే కొనసాగిస్తూ వచ్చింది. ఉత్తమ్‌ కూడా రాష్ట్ర పార్టీ అధినేతగా తన కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కానీ పార్టీలో ని అనేక మంది నేతలు ఆయన నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్‌ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపడతారనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ సీనియర్‌ నేతలు ఇలాంటి ప్రపోజల్స్ అధిష్టానానికి చేరకుండా ఏకమయ్యారు. అయినా పార్టీలో ప్రచారం మాత్రం జరుగుతూనే వస్తోంది.

ముందుగా రాష్ట్ర ఇంచార్జీ మార్పు..

సోనియా, రాహుల్ లు ముందుగా ఏఐసీసీ ప్రక్షాళన మీద దృష్టి సారిస్తారనీ, ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జిని మారుస్తారని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌.సి. కుంతియా ఆ బాధ్యతలో ఉన్నారు. కొత్త ఇంచార్జి వస్తే రెండు, మూడు నెలల టైం ఇచ్చి ఆయన రిపోర్ట్‌ ప్రకారం పార్టీలో ప్రక్షాళన మొదలుపెడతారని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్‌ తనంతట తానుగా చెబితే ఆయన మార్పు తథ్యమని, లేకపోతే రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. పార్టీ వైస్‌ ప్రెసిడెంట్లు, జనరల్‌ సెక్రటరీలతోపాటు డీసీసీల మార్పు కూడా అపుడే ఉంటుందని అంటున్నారు. రాష్ట్ర పార్టీల సమూల ప్రక్షాళన తర్వాతే ప్లీనరీ జరుగుతుందని చెబుతున్నా రు. ఎందుకంటే ఆ సమాయానికి పార్టీలో పూర్తిగా రాహుల్‌ టీమ్‌ ఉంటుందని అంటున్నారు.

యూత్, విధేయులకే ప్రియారిటీ..

పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్‌ గాంధీ ముందు నుంచీ యూత్ కు, పార్టీకి దశాబ్దాలుగా విధేయులుగా ఉన్న వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాలనీ చెబుతూ వస్తున్నారు. వీలైనంత వరకు ఆయన కొన్ని మార్పులు చేస్తూ వచ్చారు. ఫలితంగా ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ కాంగ్రెస్‌ నేతలైన చల్లా వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ లాంటి యువ నేతలకు ఏఐసీసీ సెక్రటరీలుగా అవకాశాలు వచ్చాయి. దాసోజు శావ్రణ్‌ కుమార్ కు ఏఐసీసీ స్పోక్స్‌ పర్సన్ గా చాన్స్‌ దక్కింది. సోనియాకు లేఖ రాసిన 23 మంది నేతల్లో రాష్ట్రం తో సంబంధం ఉన్న గులామ్‌ నబీ ఆజాద్‌, వీరప్ప మొయిలీ (రాష్ట్ర మాజీ ఇంచార్జీలు), మాజీ ఎంపీ రేణుకా చౌదరిలకు సీడబ్ల్యూసీ పరిణామాలతో చెక్‌ పడుతుందని అనుకుంటున్నారు. వీళ్లకు సన్నిహితంగా మెలిగే నేతలకూ పదవుల విషయంలో నిరాశే ఎదురు కావచ్చని చెప్తున్నారు.