ప్రీ బిడ్‌‌లోనే రూ.200 కోట్లు!..రాయదుర్గంలోని ప్లాట్లకు మస్త్ క్రేజ్

ప్రీ బిడ్‌‌లోనే రూ.200 కోట్లు!..రాయదుర్గంలోని ప్లాట్లకు మస్త్ క్రేజ్
  • రాయదుర్గంలోని ప్లాట్లకు క్రేజ్
  • 11.38 ఎకరాల వేలానికి టీజీఐఐసీ నోటిఫికేషన్​

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​ (టీజీఐఐసీ) భూములకు మస్తు డిమాండ్​ కనిపిస్తున్నది. నిరుడు అక్టోబర్‌‌‌‌లో ఎకరానికి రూ.177 కోట్లు పలికిన భూముల ధరలు.. అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా రాయదుర్గంలోని పన్మక్త భూములను టీజీఐఐసీ వేలం వేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. రెండు రోజుల క్రితమే దానికి సంబంధించిన ప్రీ బిడ్​ మీటింగ్​ కూడా ముగిసింది.

అయితే, పలు సంస్థలు ఎకరాకు రూ.200 కోట్లు చెల్లించేందుకు ప్రీబిడ్​ మీటింగ్​లో ఆసక్తి కనబరిచినట్టు తెలిసింది. గతంలో అక్కడే వేలం వేసిన భూములను ఎకరాకు రూ.177 కోట్లు పెట్టి ఓ సంస్థ దక్కించుకున్నది. తాజాగా.. దుర్గంచెరువుకు దగ్గర్లోని ఐటీసీ కోహినూర్‌‌‌‌కు సమీపంలో ఉన్న పన్మక్త భూముల వేలానికి రెండు వారాల క్రితం టీజీఐఐసీ నోటిఫికేషన్​ జారీ చేసింది.

సర్వే నెంబర్​ 83/1లోని ప్లాట్​ 1ఏ, 1ఎఫ్​లోని 6.29 ఎకరాలు, ప్లాట్​ నెంబర్​ పీ4లోని 5.09 ఎకరాలు సహా మొత్తంగా 11.38 ఎకరాల భూముల వేలానికి నోటిఫికేషన్​ ఇచ్చింది. ఎకరాకు రూ.139 కోట్లుగా అప్‌‌సెట్​ ప్రైస్​ను నిర్ధారించారు. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్లాట్​ నెంబర్​ 1ఏ, 1ఎఫ్​లోని భూములకు ఈ నెల 28న, ప్లాట్​ నెంబర్​ పీ4లోని భూములకు జూన్​ 1న ఆన్​లైన్​లో వేలం నిర్వహించనున్నారు.