ఛత్తీస్ గడ్ అడవిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 17 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో 12 మంది డీఆర్జీ, ఐదుగురు ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన వారని తెలిపారు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజన్. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య శనివారం అర్ధరాత్రి జరిగిన భీకర పోరులో కొందరు పోలీసుల ఆచూకీ లేకుండా పోయింది. ఎన్ కౌంటర్ సమయంలో గల్లంతైన పోలీసుల సంఖ్య మొదట 13గా సమాచారం.
అయితే మరణించిన పోలీసుల మృతదేహాలు లభ్యమైన అనంతరం వీరి సంఖ్య 17గా ఛత్తీస్ గఢ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ అడవుల్లో మావోయిస్టుల కోసం 550 మంది భద్రతా బలగాలు వెళ్లారు. గాలింపుల్లో పోలీసులు డెడ్ బాడీలు దొరికాయని స్పష్టం చేశారు ఉన్నతాధికారులు. మొత్తం 17 మంది పోలీసులు మరణించగా, గాయపడిన మరో 15 మంది పోలీసులకు రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. వీరిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.