అదనపు కట్నం తేలేదని భార్యకు నిప్పంటించి హత్య... తల్లిదండ్రులతో కలిసి భర్త దారుణం

అదనపు కట్నం తేలేదని భార్యకు నిప్పంటించి హత్య... తల్లిదండ్రులతో కలిసి భర్త దారుణం
  • ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఘోరం
  • నిందితుడిపై పోలీసుల కాల్పులు

నోయిడా(యూపీ): అదనపు కట్నం కోసం ఓ మహిళపై అత్తమామలు, భర్త తీవ్రంగా దాడి చేశారు. ఆరేండ్ల కొడుకు ఎదుటే ఆమెను చితకబాదారు. ఆపై యాసిడ్‌‌‌‌‌‌‌‌ పోసి నిప్పంటించారు. పరిస్థితి సీరియస్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా బాధితురాలు ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని నోయిడాలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది. మృతురాలి సోదరి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి దాడి..

నోయిడా చెందిన నిక్కీ, ఆమె అక్క కాంచన్‌‌‌‌‌‌‌‌ను సిర్సా గ్రామానికి చెందిన విపిన్‌‌‌‌‌‌‌‌ సోదరులకు ఇచ్చి 2016లో పెండ్లి చేశారు. ఆ సమయంలో భారీ మొత్తంలో నగదు, కారు, బైక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినప్పటికీ అదనంగా 36 లక్షలు తేవాలని నిక్కీని వేధించినట్లు కాంచన్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అత్తామామలతో కలిసి విపిన్‌‌‌‌‌‌‌‌ తన అక్కను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టారని, యాసిడ్‌‌‌‌‌‌‌‌ పోసి నిప్పంటించి చంపేశారని తెలిపారు. అడ్డుకునేందుకు యత్నించిన తనపై దాడిచేయడంతో సోయితప్పి పడిపోయానని చెప్పారు.

రివాల్వర్ లాక్కుని పరారయ్యే ప్రయత్నం..

నిందితుడు విపిన్‌‌‌‌‌‌‌‌పై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. సీన్‌‌‌‌‌‌‌‌ రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ కోసం స్పాట్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లగా విపిన్‌‌‌‌‌‌‌‌ పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఓ పోలీసు నుంచి రివాల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాక్కుని పరిగెత్తగా కాల్పులు జరిపామని, కాలుకు బులెట్‌‌‌‌‌‌‌‌ తగలడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. కాగా, తన కూతురును చంపిన విపిన్‌‌‌‌‌‌‌‌ను ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇటీవల తాను బెంజ్‌‌‌‌‌‌‌‌ కారు కొన్నప్పటి నుంచి నిక్కీపై వేధింపులు పెరిగాయని, ఆ కారైనా ఇవ్వాలి, లేదంటే 40 లక్షలైనా తేవాలంటూ తన కూతురుపై దాడి చేశారని ఆరోపించారు.