కట్టుకున్న భార్యను కన్న కొడుకును కాదని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు! అంతటితో ఆగకుండా నిలదీసిన మొదటి భార్యపైన దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బండా రోహిత్ యాదవ్ అనే వ్యక్తికి మహాలక్ష్మితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం మూడు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, కొంతకాలంగా భార్యాపిల్లలను సరిగ్గా పట్టించుకోని రోహిత్ యాదవ్... ఇటీవల మొదటి భార్యకు తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు.
తన జీవితాన్ని నట్టేట ముంచిన విషయం తెలిసి.. భర్తను నిలదీసేందుకు వెళ్లిన మొదటి భార్య మహాలక్ష్మిపై రోహిత్ యాదవ్ దాడికి పాల్పడ్డాడు. తనను, తన బిడ్డను వద్దంటూ వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహాలక్ష్మి... న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందే కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగింది.
తనకు, తన బిడ్డకు జరిగిన అన్యాయంపై బాధితురాలు చందానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
