125 ఏండ్ల నాటి చారిత్రక భవనం తిరిగి పోలీస్​స్టేషన్

125 ఏండ్ల నాటి చారిత్రక భవనం తిరిగి పోలీస్​స్టేషన్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​రాంగోపాల్​పేట జేమ్స్​స్ట్రీట్​లోని చారిత్రక బిల్డింగ్​కు రిపేర్లు పూర్తవడంతో మంగళవారం తిరిగి హైదరాబాద్ సిటీ పోలీసులకు అప్పగించారు. సిటీ సీపీ సీవీ ఆనంద్​మంగళవారం పురాతన భవనాన్ని సందర్శించారు. ఈ భవనాన్ని 1900లో నిర్మించారని, 2016 వరకు అంటే 116 సంవత్సరాలు రామ్​గోపాల్​ పేట పోలీస్​ స్టేషన్​ఇందులోనే కొనసాగిందన్నారు. 

9 ఏండ్ల కింద మినిస్టర్​ రోడ్డులోని మరో భవనంలోకి షిప్ట్ చేశామన్నారు. రిపేర్లు పూర్తికావడంతో హెచ్ఎండీఏ తిరిగి సిటీ పోలీసులకు అప్పగించిందన్నారు. త్వరలో తమ వస్తువులన్నీ భవనంలోకి తరలించి, జిల్లా ఇన్​చార్జ్​మంత్రి పొన్నం ప్రభాకర్​ తో ప్రారంభిస్తామన్నారు. పురాణి హవేలీ కమిషనర్​ఆఫీసుకు మూడేండ్లుగా రిపేర్లు జరుగుతున్నాయని, త్వరలో దాన్ని కూడా పున:ప్రారంభిస్తామన్నారు. ప్రతి శుక్రవారం అక్కడి నుంచే తాను విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. నార్త్ జోన్​ డీసీపీ ఎస్​.రష్మీ పెరుమాల్​, ట్రాఫిక్​ డీసీపీ రాహుల్ హెగ్డే, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.