
- వలస కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీ కొట్టిన వైనం
- ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
- మరో 11 మంది కూలీలకు గాయాలు
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ లో ఓ రెడీమిక్స్ లారీ బీభత్సం సృష్టించింది. గోపాన్ పల్లిలోని ఎన్టీఆర్ నగర్ లేబర్ అడ్డా సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి వలస కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది కూలీలు గాయపడగా, వీరిలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లేబర్ అడ్డా వద్ద 14 మంది కూలీలను తీసుకొని టాటాఏస్ ట్రాలీ ఆటో వట్టినాగులపల్లి వైపు బయలుదేరింది. ఈ క్రమంలో రెడీమిక్స్ లారీ (టీఎస్30 టీఏ8333) మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కు తగిలి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న 14 మంది కూలీలకు గాయాలు కాగా, వీరిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో బీహర్లోనిబెగుసరామ్ జిల్లా కాశీనాథపురకు చెందిన దిల్కుష్ కుమార్(22) తలకు తీవ్ర గాయాలు కావడంతో సిటీజన్ హస్పిటల్ కు, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కర్నాటక రాష్ట్రం చించోలీకి చెందిన కీము(45)కు తీవ్ర గాయాలు కావడంతో మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ట్రాలీ ఆటో డ్రైవర్ దానాతో పాటు లక్ష్మణ్, సువాలీ, చాందీ, జాను బాయ్, రవి నాయక్, పీరా, రాహుల్, చందు, నార్య, బాదల్ కుమార్ కు గాయాలయ్యాయి. ప్రమాదానికి జరిగిన వెంటనే శ్రీ డెక్కన్ రెడీమిక్స్ లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.