
బషీర్బాగ్, వెలుగు: ఆన్లైన్లో మెడిసిన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. 23 ఏండ్ల బాధిత విద్యార్థి ఆన్లైన్ లో సిప్లా నికోటిన్ గమ్స్ అనే మెడిసిన్ కోసం గూగుల్ చేశాడు. స్కామర్స్ పెట్టిన మొబైల్ నంబర్ కు బాధితుడు ఫోన్ చేయగా, ఒక్కో యూనిట్ రూ.5 వేలకు విక్రయిస్తామని తెలిపారు. బాధితుడు ఐదు యూనిట్లకు రూ.25 వేలను స్కామర్స్ అకౌంట్ కు పంపించాడు.
డెలివరీ ఆలస్యం కావడంతో బాధితుడు తాను చెల్లించిన డబ్బులను రిటర్న్ చేయాలని కోరాడు. స్కామర్స్ తో వాట్సాప్ కాల్ లో మాట్లాడుతుండగానే, బాధితుడి తల్లి నంబర్ ఓ ఏపీకే ఫైల్ వచ్చింది. అనుకోకుండా బాధితుడు ఆ లింక్ ను క్లిక్ చేయగా , అకౌంట్ నుంచి రూ.2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు తన తల్లి అకౌంట్ బ్యాంక్ అధికారులను సంప్రదించగా , సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మొత్తం రూ 2,25,000 మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.