హైదరాబాద్ సిటీ, వెలుగు: మాదాపూర్ లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల అభివృద్ధి పనులను ఆగస్టు మూడో వారానికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ రెండు చెరువుల్లో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్, ఎంట్రెన్స్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పరిసరాల్లో పార్కులు, ఓపెన్ జిమ్లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలన్నారు. సున్నం చెరువు ఆక్రమణల తొలగింపు అనంతరం 16.4 ఎకరాల నుంచి 30.5 ఎకరాలకు, తమ్మిడికుంట చెరువు 16.2 ఎకరాల నుంచి 29.3 ఎకరాలకు విస్తరించిందన్నారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ డి ఆనంద్కుమార్, ఏసీపీ తిరుమల్ , పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ ప్రతినిధి యూనస్ పాల్గొన్నారు.
