తన సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలను చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఫలితంగా సినిమా 2 వారాలు ఆలస్యంగా విడుదలైందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఆ ఆలస్యానికి కారణమైన వాళ్లందరి మీద లీగల్ గా వెళ్లబోతున్నామని ఆయన అన్నారు.
ఇటీవల ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నవంబర్ 29న సినిమా విడుదల అనుకున్నాం. అయితే కొన్ని కారణాలు వలన 2 వారాలు లేట్ అయింది. లేట్ కు కారణం అయిన వాళ్ళ మీద మేము లీగల్ గా వెళ్ళబోతున్నాం. సినిమా రిలీజ్ అయితే గోడవలు జరుగుతాయని ఆరోపణలు చేసిన వారు ఇపుడు ఏమి మాట్లాడటం లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తరువాత కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటే వారికి కోర్టు లంటే గౌరవం లేదు అని అర్థమవుతుంది. ఆరోపణలు చేసిన వాళ్ళ వెనుక ఎవరున్నారు, ఏంటీ అనే విషయాలు మాకు తెలిశాయి’’ అని ఆర్జీవీ అన్నారు.
సినిమా విడుదలను అడ్డుకోవాలని చూసిన ఇంద్రసేనా చౌదరి, K.A. పాల్, సెన్సార్ బోర్డ్ జ్యోతి.. వీరి ముగ్గురు మీద లీగల్ గా వెళ్లబోతున్నామని వర్మ చెప్పారు.
కేవలం ఈ సినిమాను సెటైరికల్ , కామెడీ గానే తీసానని, ఒక సీరియస్ సబ్జెక్ట్ ని సీరియస్ గా కాకుండా సెటైరికల్ గా, కామెడీ గా చెప్పానని ఆర్జీవీ అన్నారు. అనవసర ఆరోపణలు చేస్తూ కొంతమంది సినిమా ఆపేయాలని గగ్గోలు పెట్టారన్నారు. ఇక ముందు కూడా డెఫినెట్ గా ఇలాంటి సెటైరికల్ మూవీస్ చేస్తానని ఆయన చెప్పారు.
ఈ సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ కోసం హోటల్ లో పని చేసే వ్యక్తిని తీసుకువచ్చి ట్రైనింగ్ ఇచ్చి, యాక్టింగ్ చేయించామని వర్మ చెప్పారు. తన తర్వాతి సినిమా ‘ఎంటర్ ది లేడీ డ్రాగన్’ ని 16భాషల్లో రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ సినిమా విడుదల జనవరిలో కాని ఫిబ్రవరి లో కాని ఉంటుందన్నారు.