చెన్నై: క్రీడల్లో సవాల్ చేయడం మామూలే. ఒక జట్టు ఆటగాళ్లకు మరో జట్టు ఆటగాళ్లు సవాళ్లు విసురడం సహజం. అయితే ఇక్కడ ఓ ప్లేయర్ మాత్రం తన సొంత జట్టు ఆటగాడికే చాలెంజ్ చేశాడు. అతడెవరో కాదు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్. అతడు సవాల్ విసిరింది నయా వాల్గా పిలుచుకునే ఛటేశ్వర్ పుజారాకు కావడం గమనార్హం.
రాబోయే ఇంగ్లండ్ సిరీస్లో మొయిన్ అలీతోపాటు మరే స్పిన్నర్ బౌలింగ్లోనైనా ముందుకు దూసుకొచ్చి బౌలర్ తల మీదుగా గనుక పుజారా భారీ షాట్ కొడితే తాను సగం మీసం తీయించుకుంటానని అశ్విన్ సరదాగా సవాల్ విసిరాడు. ఆ సగం మీసంతోనే గ్రౌండ్లో మ్యాచ్ పూర్తి చేస్తానని చెప్పాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో అశ్విన్ 12 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్తో తనను పోల్చడంపై అశ్విన్ సీరియస్ అయ్యాడు. లయన్తో పోటీ పడటం కంటే స్టీవెన్ స్మిత్ వికెట్ తీయడమే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు.