- హైరిస్క్ కేసును విజయవంతం చేసిన డాక్టర్లు
హైదరాబాద్/పద్మారావు నగర్, వెలుగు: ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ హాస్పిటల్స్ కే జైకొట్టి ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. సోమవారం రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ వీపీ గౌతమ్ తన భార్య ప్రసవం కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ను ఎంచుకున్నారు. గౌతమ్ భార్య గౌతమికి ఇది రెండో కాన్పు కావడం, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసు కావడంతో 4 రోజుల కిందే గాంధీలోని ఎంసీహెచ్ బ్లాక్లో చేర్పించారు. సోమవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ శోభ, సూపరింటెండెంట్ డాక్టర్ వాణి నేతృత్వంలోని స్పెషలిస్ట్ డాక్టర్ల టీమ్ సిజేరియన్ పూర్తి చేసింది. గౌతమి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఐఏఎస్ గౌతమ్ ఖమ్మం కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా మొదటి డెలివరీని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లోనే చేయించారు.
కాస్త డిఫరెంట్ గా... యంగ్ ఆఫీసర్లు
మొన్నటికి మొన్న ఇద్దరు కలెక్టర్లు కూడా ప్రభుత్వ వైద్యానికే జై కొట్టారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తన భార్య డెలివరీని గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ లో చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ భార్య శ్రద్ధా పాటిల్ ప్రసవం కూడా పాల్వంచలోని గవర్నమెంట్ హాస్పిటల్ లోనే జరిగింది. భద్రాద్రి కలెక్టర్ గా ఉన్నప్పుడు అనుదీప్ దురిశెట్టి తన భార్య మాధవి ప్రసవం కోసం భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో చేర్పించారు. గతంలో అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన ఇలా త్రిపాఠి ఏరియా హాస్పిటల్ లో ప్రసవం చేయించుకున్నారు. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ గా చేసిన స్నేహలత మొగిలి కూడా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లోనే ప్రసవించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ హాస్పిటల్ లో ఈఎన్టీ డిపార్ట్ మెంట్ కు వెళ్లి ముక్కు సర్జరీ చేయించుకున్నారు.
