రూ.కోటి సంపాదించకపోతే వేస్ట్.. బెంగళూరు నుంచి తట్టబుట్ట సర్ధుకుని వెళ్లిపోండి! పోస్ట్ వైరల్

రూ.కోటి సంపాదించకపోతే వేస్ట్.. బెంగళూరు నుంచి తట్టబుట్ట సర్ధుకుని వెళ్లిపోండి! పోస్ట్ వైరల్

Bengaluru Salaries: సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో ఐటీ పరిశ్రమకు పెట్టింది పేరు బెంగళూరు నగరం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అనేక నగరాల యువత తమ ఉపాధి, ఉద్యోగ అవసరాల్లో భాగంగా బెంగళూరులో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో సౌవర్ దత్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారిపోయింది.

ప్రస్తుతం బెంగళూరులో రూ.50 లక్షల వేతన ప్యాకేజీ కొత్త రూ.25 లక్షలుగా మారిపోయిందని సౌవర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది రూ.కోటి వేతన ప్యాకేజీని కోరుకుంటున్నారని, ఇది సర్వ సాధారణంగా మారిపోయిందని సదరు వ్యక్తి అభిప్రాయపడ్డారు. బెంగళూరులో కనీసం మూడేళ్ల అనుభవం కలిగిన ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం రూ.50 లక్షల ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నారని యూజర్లు చెబుతున్నారు. అలాగే కనీసం 8 నుంచి 12 ఏళ్లు అనుభవం కలిగిన టెక్కీలు ఏకంగా రూ.కోటి నుంచి కోటి 25 లక్షలు అడుగుతున్నట్లు చెప్పారు. ఇక 15 ఏళ్లు అనుభవం కలిగిన ఉద్యోగులు రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడైంది. 

 

బెంగళూరులో ఖర్చులు కూడా అక్కడి ప్యాకేజీలకు ఏమాత్రం తగ్గకుండానే పెరిగిపోవటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు రూ.50 లక్షల వేతనం ఆఫర్ చేస్తున్నప్పటికీ అందులో బేసిక్ శాలరీ రూ.16 లక్షలు మాత్రమేనని ఒక టెక్కీ పోస్ట్ చేశారు. మిగిలినవరి బోనస్, స్టాక్ ఆప్షన్స్ గా ఉన్నాయి. దీని ప్రకారం వారికి నెలవారీ టేక్ హోమ్ శాలరీ కేవలం రూ.లక్ష 20 వేలుగా ఉంది. ఈ డబ్బు నగరంలో పెరిగిన ఖర్చులకు ఏమాత్రం సరిపోదని చాలా మంది వాపోతున్నారు.

ప్రస్తుతం ఉన్న తరుణంలో ఐటీ ఉద్యోగులు బెంగళూరులో ఏడాదికి రూ.కోటి సంపాదించకపోతే అక్కడ ఉండటం టైమ్ వేస్ట్ అంటూ ఒక యూజర్ రిప్లై ఇచ్చారు. దీనికంటే అక్కడి నుంచి తట్టబుట్ట సర్థుకుని వెళ్లిపోవటం మంచిదని అన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.50 లక్షల పే ప్యాకేజ్ గతంలో ఉన్న రూ.10 లక్షల ప్యాకేజీతో సమానంగా పేర్కొన్నారు. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఇంత భారీ ప్యాకేజీలు కొంతమంది టాప్ ప్రొఫెషనల్స్ కి మాత్రమే దక్కుతాయని అంటున్నారు. పైగా ఇది రోజురోజుకూ పెరుగుతున్న వేతన అంతరాలను సూచిస్తోంది. 

దీనిపై స్పందించిన ఒక టెక్కీ హైదరాబాదులో మాత్రం 25 లక్షల రూపాయల విలువ రూ.25 లక్షలుగానే ఉందని అన్నారు. అయితే ఇప్పుడు పైన జరిగిన చర్చ మెుత్తం బెంగళూరు నగరానికి మాత్రమే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు నివసిస్తుండటంతో ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టెక్ టాలెంట్ ఉన్న అతిపెద్ద నగరంగా మారిపోయింది. దీంతో లండన్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల చెంత బెంగళూరు చేరిపోయింది.