హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ (ఐఐఎం) హైదరాబాద్ చాప్టర్, ఇతర జాతీయ ప్రయోగశాలలు, విద్యాసంస్థల (ఏటీఎమ్ 2022) ఆధ్వర్యంలో ఐఐఎం 76వ వార్షిక సాంకేతిక సమావేశం హైదరాబాద్లో మొదలయింది. ఇందులో భాగంగా ‘‘వేగంగా మెటీరియల్స్ అభివృద్ధి, తయారీ– శాస్త్రీయతపై సాంకేతిక ఆలోచనలు (ఏఏమ్డీఏఏ మ్) ’’ అనే అంశంపై సోమవారం అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు,గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చీఫ్ గెస్టుగా వచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ బిజె రావు, ఐఐఎమ్ హైదరాబాద్ చైర్మన్, డిఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూధన్ రెడ్డి, డిఆర్డిఓ ఛైర్మన్ సమీర్ కామత్లు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కులస్తే మాట్లాడుతూ మన దేశానికి ప్రయోజనం చేకూర్చేలా డిజైన్లు తయారు చేయాలని మెటలర్జిస్టులకు సూచించారు. ప్రధాని మోడీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. లోహాల ఉత్పత్తి పెంపునకు తీసుకున్న చర్యలను వివరించారు. ఐఐఎమ్ హైదరాబాద్ చైర్మెన్, డీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మూడు రోజుల సమావేశంలో మెటీరియల్ సైన్స్, తయారీ రంగాలకు సంబంధించిన టెక్నాలజీల గురించి చర్చిస్తామని చెప్పారు. దాదాపు 47 అంశాలపై ప్యానల్ డిస్కషన్లు జరుగుతాయని వివరించారు. ఈ16వ తేదీ వరకు జరిగే ఈ మూడు రోజుల సదస్సుకు ప్రఖ్యాత మెటలర్జిస్ట్లు, మెటీరియల్ సైంటిస్టులు వచ్చారు. టెక్నికల్ సెషన్స్ లో ఇంజనీర్లు, విద్యార్థులు తమ సాంకేతిక పరిఙ్ఞానాన్ని, అనుభవాలను పంచుకుంటారు.