హైదరాబాద్​ నగరం నడిబొడ్డున ఆక్రమణల కూల్చివేత

హైదరాబాద్​  నగరం నడిబొడ్డున ఆక్రమణల కూల్చివేత
  • ప్యాట్నీ నాలాపై మూడు బిల్డింగులు, మూడు షెడ్లు నేలమట్టం  
  • స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి హైడ్రా
  • హిటాచీ, జేసీబీలతో10 గంటలపాటు కూల్చివేతలు 
  • 150 మీటర్ల మేర నాలా క్లియర్​
  • ఆరు కాలనీల్లోని 25 వేల మందికి తప్పిన తిప్పలు 
  • ఇక నుంచి 4 నెలలపాటు  నాలాలపై స్పెషల్ డ్రైవ్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రసూల్​పురా జంక్షన్​లోని ప్యాట్నీ నాలాను ఆనుకుని నిర్మించిన ఆక్రమణలను హైడ్రా శుక్రవారం నేలమట్టం చేసింది. సుమారు150 మీటర్ల మేర ఉన్న మూడు బిల్డింగులు, మూడు షెడ్లను కూలగొట్టింది. ఒకప్పుడు నాలా 70 అడుగులు వెడల్పుతో ఉండేది. హస్మత్​పేటలో మొదలై 23 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లహరి గ్రీన్స్​రోడ్, మహేంద్ర హిల్స్, జామియా మసీద్​రోడ్, ప్యాట్నీ ఏరియా నుంచి బుద్దభవన్​మీదుగా సంజీవయ్య పార్కు నుంచి అశోక్​నగర్​ నాలాలో కలిసి అక్కడి నుంచి మూసీలో వెళ్లి కలుస్తుంది. 

అయితే, ప్యాట్నీ వద్ద ఆక్రమణలతో 15 నుంచి 18 అడుగులకు కుంచించుకుపోయింది. దీంతో వర్షాలు కురిసినప్పుడు నీరంతా రోడ్లపైకి చేరుతోంది. 2.5 సెంటిమీటర్ల వాన పడితే చాలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. పాయిగ కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్, ప్యాట్నీ కాలనీ, విమాననగర్, బీహెచ్ఈఎల్ కాలనీ, ఇందిరమ్మ నగర్ లు మునిగిపోతున్నాయి. 20 నుంచి 30 ఏండ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. అయితే, కోర్టు కేసులు ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. ఈ మధ్య సమస్య తీవ్రం కావడంతో ఆయా కాలనీలవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 

స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటిపారుదల, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండా కూల్చేయవచ్చని ‘బుల్డోజర్’ ​కేసులో సుప్రీం తీర్పు ఉండడంతో దాన్ని శుక్రవారం అమలు చేశారు. హైడ్రా యాక్షన్​తో ఈ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 25 వేల కుటుంబాలకు తిప్పలు తప్పుతాయని అధికారులు చెబుతున్నారు. 15 రోజుల్లో రిటైనింగ్ వాల్​నిర్మించడంతో పాటు నాలా  విస్తరణ పనులు మొదలుపెట్టనున్నారు. 

కూల్చివేతలు ఇలా.. 

ఉదయం 7 గంటలకు రెండు హిటాచీలు, 2 జేసీబీలతో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. మూడు ఫ్లోర్ల బిల్డింగులు రెండు, రెండు ఫ్లోర్ల బిల్డింగులు రెండు, మూడు షెడ్లు ఉండడంతో సుమారు 10 గంటల సమయం పట్టింది. ఈ బిల్డింగులను యజమానులు అద్దెకు ఇవ్వగా అందులో ఆప్టికల్​షాపు, వాటర్​వాషింగ్​, వెహికల్​బ్యాటరీస్​వంటి షాపులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా సాయంత్రం ఐదు గంటలకు యాక్షన్​ముగిసింది. సుమారు 50 మంది హైడ్రా సిబ్బంది కూల్చివేతలను పర్యవేక్షించగా 30 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. 

త్వరలో చీకోటి గార్డెన్స్ వద్ద....

వర్షాకాలంలో జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నాలుగునెలలు నాలాలపై ఉన్న ఆక్రమణలను గుర్తించి కూల్చేందుకు హైడ్రా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువగా ఆక్రమణలకు గురైన నాలాలను హైడ్రా స్టడీ చేస్తోంది. ఆ నాలాలకు సంబంధించిన మ్యాప్ లను పరిశీలిస్తోంది. ఈ డ్రైవ్ లో భాగంగానే ప్యాట్నీ నాలాపై ఆక్రమణలు జరిగాయని తేల్చి కమర్షియల్ బిల్డింగులను కూల్చివేసింది.అలాగే, తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్న బేగంపేటలోని చీకొటి గార్డెన్స్ వద్ద ఆక్రమణలను కూల్చివేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాలతో పాటు నాలాలను ఆక్రమించి కట్టిన పలు కమర్షియల్​నిర్మాణాలను కూల్చివేయనున్నది. 

కమర్షియల్ కట్టడాలనే కూల్చేస్తాం: రంగనాథ్

నగరంలో నీటి ప్రవాహనికి అడ్డంకిగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని హైడ్రా చీఫ్​రంగనాథ్​స్పష్టం చేశారు. నాలాలపై వ్యాపార అవసరాల కోసం కట్టిన వాటిని వదిలే ప్రసక్తి లేదన్నారు. పేద ప్రజల నిర్మాణాల జోలికి వెళ్లేది లేదన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి అవసరాల దృష్ట్యా తొలగించాల్సి వస్తే ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామన్నారు. 

న్యాయం జరిగిన తర్వాతే సదరు నిర్మాణాలను తొలగిస్తామన్నారు. పేదల ఇండ్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టబోమని, సీఎం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో పేదలు ఆందోళన పడాల్సిన అవసరంలేదన్నారు. సిటీలో 190 వాటర్ లాగింగ్ పాయింట్లపై స్టడీ చేస్తున్నామన్నారు. ఈ నాలుగు నెలలపాటు నాలాలపై డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు.