కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పాటైన రెండు వారాలు గడుస్తున్నా అపోజిషన్ పార్టీల పొజిషన్ ప్రశ్నార్థకంగానే ఉంది. లోక్సభ ఫలితాల ఎఫెక్ట్తో చాలా చోట్ల పొలిటిక్ సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్ష శిబిరం పరస్పర నిందారోపణల్లో మునిగిపోయింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ ఢిల్లీలో పార్టీలు ఆత్మరక్షణలో పడిపోయాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఫోకస్అయిన రాహుల్ గాంధీ(కాంగ్రెస్), మమతా బెనర్జీ(టీఎంసీ), మాయావతి(బీఎస్పీ), చంద్రబాబు(టీడీపీ) ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. 2014తో పోల్చుకుంటే 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ కాస్త మెరుగుపడ్డా రాహుల్, మాయల ‘ప్రధాని’ కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ దెబ్బకు టీడీపీ, చంద్రబాబు కుదేలైపోయారు. బెంగాల్లో మరో రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మమతా బెనర్జీకి బీజేపీ పెద్ద చాలెంజ్లు విసురుతున్నది. ఆరు నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. లోక్సభ ఓటమికి మీరే బాధ్యులంటూ ఆ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్…
లోక్సభ ఎన్నికల్లో మహాకూటమిగా పోటీచేసి విఫలమైన బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించాయి. బీజేపీని ఓడించే అవకాశాన్ని ఎస్పీ జారవిడిచిందని, కనీసం యాదవుల బేస్ ఓట్లు కూడా రాబట్టలేకపోయిందంటూ మాయావతి నిందించారు. అదే స్థాయిలో స్పందించిన అఖిలేశ్, అజిత్సింగ్లు సొంతదారిలో పోతామని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికకావడంతో యూపీలోని 11 అసెంబ్లీ సెగ్మెంట్లు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కలిసికట్టుగా బీజేపీని ఓడించలేకపోయిన ఈ మూడు పార్టీలు విడివిడిగా ఆ పని ఎలా చేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మహారాష్ట్ర…
పార్టీ వైఫల్యానికి తోడు నాయకుల మధ్య కుమ్ములాటతో మహారాష్ట్రలో కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. లోక్సభ ఎన్నికలకు ముందు అధిష్టానం సంజయ్ నిరుపమ్ను తప్పించి మిళింద్ దేవరాకు ముంబై కాంగ్రెస్ చీఫ్ పదవి అప్పగించినా ఫలితం మారలేదు. రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు బ్లేమ్గేమ్తో కాలం వెళ్లదీస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు రాధాకృష్ణ విఖే, అబ్దుల్ సత్తార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిమరీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంకో పది, పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా కాషాయతీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్(1) కంటే ఎన్సీపీకే(4) ఎక్కువ సీట్లొచ్చాయి. ఈ ఎఫెక్ట్తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
హర్యానా…
ఇక్కడ బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, ప్రస్తుత స్టేట్ కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వర్ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. విభేదాల్ని పరిష్కరించడానికి ఏఐసీసీ దూతగా సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రంగంలోకి దిగినా పరిస్థితి కంట్రోల్లోకి రాలేదు. ఆజాద్ ముందే రెండు వర్గాలు వాదులాటకు దిగాయి. కొద్దిరోజుల కిందట జరిగిన రాజీ భేటీలో సహనం కోల్పోయిన అశోక్ తన్వార్.. ‘నన్ను కాల్చిపారేయండి..’ అంటూ కోపంతో ఊగిపోయారు.
వెస్ట్ బెంగాల్…
బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న టీఎంసీ చీఫ్, మమతా బెనర్జీ.. ఎన్నికల తర్వాత కూడా పొలిటిక్ వార్ కొనసాగిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ధన బలంతోనే బీజేపీకి సీట్లొచ్చాయని దీదీ ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరుతున్నారు. ప్రత్యర్థిపై ఎదురుదాడితోనే పార్టీని కాపాడుకోవాలనుకుంటున్న మమత ఆ క్రమంలో కొన్ని ఏరియాల్లోని బీజేపీ ఆఫీసుల్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను గందరగోళంలోకి నెట్టేశాయి.
రాజస్థాన్…
కొడుకు నిలబడ్డ సీట్లో తప్ప మిగతా చోట్ల పార్టీకి ప్రచారం చేయలేదని ఆరోపణలు ఎదుర్కొన్న సీఎం అశోక్ గెహ్లాట్పై విమర్శలదాడి ఇంకా పెరిగింది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా గెహ్లాట్ను టార్గెట్ చేశారు. ఒక దశలో సచిన్ కాంగ్రెస్ను వీడతారని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆయన్ని అనుసరిస్తారని, బీజేపీ సపోర్ట్తో సీఎం పోస్ట్ చేపడతారన్న వార్తలు కూడా వచ్చాయి.
కర్ణాటక…
28 లోక్సభ స్థానాలకుగానూ 25 సీట్లు బీజేపీ గెల్చుకోవడంతో కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ నేతలను కలుస్తుండటం, బీఎస్పీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలూ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని సంకేతాలివ్వడం లాంటి పరిణామాలు లోక్సభ ఎన్నికల తర్వాతే జరిగాయి. దేవేగౌడ ఆయన మనవడు నిఖిల్ గౌడతోపాటు జేడీఎస్ అభ్యర్థులు దారుణంగా ఓడిపోవడానికి కాంగ్రెసే కారణమని సీఎం కుమారస్వామి బాహాటంగా విమర్శించారు.