మొహాలీ: శ్రీలంకతో శుక్రవారం మొదలైన ఫస్ట్ టెస్ట్లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. రిషబ్ పంత్ (97 బాల్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96) మెరుపులకు హనుమ విహారి (58), విరాట్ కోహ్లీ (45), రవీంద్ర జడేజా (45 బ్యాటింగ్) అండగా నిలవడంతో.. తొలి రోజు మొత్తం మన ఆధిపత్యమే నడిచింది. లంక బౌలర్లు తేలిపోవడంతో.. ఫస్ట్ డే ఆట ముగిసే టైమ్కు ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 6 వికెట్లకు 357 రన్స్ చేసింది. జడేజాతో పాటు అశ్విన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
రోహిత్ ఫెయిల్..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్ (29), మయాంక్ అగర్వాల్ (33) మెరుపు స్టార్ట్ ఇచ్చినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఫస్ట్ వికెట్కు 52 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి రోహిత్ ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారి తెగువ చూపించాడు. 19వ ఓవర్లో మయాంక్ను.. స్పిన్నర్ లసిత్ ఎంబుల్డేనియా (2/107) సూపర్ ఆర్మ్ బాల్తో పెవిలియన్కు పంపడంతో సెకండ్ వికెట్కు 28 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ‘కింగ్ కోహ్లీ’ అంటూ 5 వేల మంది ఫ్యాన్స్ కేరింతల మధ్య క్రీజులోకి వచ్చిన విరాట్ చాలా కాన్ఫిడెన్స్గా కనిపించాడు. లెఫ్టార్మ్ సీమర్ విశ్వ ఫెర్నాండో (1/69) బాల్ను పర్ఫెక్ట్ స్ట్రెయిట్ డ్రైవ్తో రోప్ దాటించి టచ్లోకి వచ్చాడు. విహారి, కోహ్లీ మధ్య సమన్వయం కుదరడంతో సెకండ్ సెషన్లోనూ ఇండియానే డామినేషన్ చేసింది. అయితే బాగా ఆడుతున్న టైమ్లో ఎంబుల్డేనియా వేసిన టర్నింగ్ బాల్ విరాట్ ఆఫ్ స్టంప్ను పడగొట్టింది. థర్డ్ వికెట్కు 90 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. మరో మూడు ఓవర్ల తర్వాత ఫెర్నాండో బౌలింగ్లో విహారి కూడా వెనుదిరిగాడు.
పంత్ ధనాధన్..
కోహ్లీ ఔటైన తర్వాత వచ్చిన రిషబ్ పంత్.. ఫ్యాన్స్కు టీ20 మ్యాచ్ను చూపించాడు. శ్రేయస్ అయ్యర్ (27) నిరాశపర్చినా.. జడేజాతో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మిడ్వికెట్, లాంగాన్, లాంగాఫ్లో నాలుగు భారీ సిక్సర్లు కొట్టిన పంత్.. 73 బాల్స్లో హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. రెండో ఎండ్లో జడేజా సింగిల్స్ తీస్తూ పంత్కు ఎక్కువగా స్ట్రయికింగ్ ఇచ్చాడు. ఫలితంగా స్టేడియం నలుమూలల షాట్లు ఆడిన పంత్.. ఒకటిన్నర సెషన్లోనే సెంచరీకి చేరువగా వచ్చాడు. కానీ 81 ఓవర్లో లక్మల్ (1/63) వేసిన బాల్కు క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐదోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆరో వికెట్కు 104 రన్స్ సమకూరాయి.