హైదరాబాద్,వెలుగు: టీజీ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 1,632 ఖాళీలకు 54,901 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడంతో భారీ పోటీ నెలకొంది. ఈనెల 23 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు డ్రైవింగ్ టెస్ట్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్ మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ వేదికగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసిన 28,903 మంది అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్టులు ఉంటాయని వెల్లడించారు.శ్రామిక్ పోస్టులకు అప్లై చేసిన 25,998 మందికి మాత్రం వెయిటేజీ మార్కుల కేటాయింపు కోసం కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నెల 13 నుంచి అడ్మిట్ కార్డులు..
ఈ నెల 13 ఉదయం 8 గంటల నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అడ్మిట్ కార్డులు పొందడంలో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in కు ఈమెయిల్ చేయాలని లేదా పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య 9391005006 నంబరును సంప్రదించాలని తెలిపారు. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
