సోషల్ మీడియాలో పిల్లల అభ్యంతరకర కంటెంట్ తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు మెటా ప్లాట్ఫామ్లో విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఒక్క వారంలోనే దీనిపై ఏకంగా 50కి పైగా ఫిర్యాదులు అందాయి.
దింతో ఈ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయింది. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా, బీహార్.. ఇలా మొత్తం 8 రాష్ట్రాల డీజీపీలకు నోటీసులు పంపింది. వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మెటాకు గట్టి వార్నింగ్:
భారత చట్టాలకు లోబడి నడుచుకోవాలని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకోవాలని మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ) సంస్థను ఎన్హెచ్ఆర్సీ హెచ్చరించింది. అలాగే కేంద్ర ఐటీ శాఖను కూడా అలర్ట్ చేసింది.
నేరం చాలా పెద్దది:
పిల్లలపై లైంగిక దాడి చేయడం, దాన్ని వీడియో తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇవన్నీ వేర్వేరు తీవ్రమైన నేరాలని ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో స్పష్టం చేశారు. ఇలాంటి కంటెంట్ను తొలగించడంలో సోషల్ మీడియా కంపెనీలు తమ బాధ్యత నుంచి తప్పుకోలేవని ఆయన తేల్చి చెప్పారు.
