- అగ్రివర్సిటీలో భారత్– ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అగ్రికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. గురువారం అగ్రికల్చర్ వర్సిటీలో భారత్–ఆస్ట్రేలియా దేశాల వ్యవసాయ రంగ సహకారానికి స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ (ఐఏఎస్ఎఫ్ఎన్) కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా వీసీ జానయ్య మాట్లాడుతూ విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్–ఆస్ట్రేలియా భాగస్వామ్యం కీలకమన్నారు. రైతులకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలు అందించడంలో ఇలాంటి భాగస్వామ్యాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ, ప్రెసిషన్ ఫార్మింగ్, స్థిర వ్యవసాయ విధానాలు, అగ్రికల్చర్ ఇన్నొవేషన్ రంగాల్లో భారత్–ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేదిక ద్వారా రెండు దేశాలకు చెందిన విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమలు, ఇతర భాగస్వామ్య సంస్థల మధ్య జాయింట్ రిసర్చ్ లు, పైలట్ ప్రాజెక్టులు, టెక్నాలజీ మార్పిడి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పీజేటీఏయూ, ఆర్ఐసీహెచ్, సీఎస్యు, బీఈఎస్టీ, సీఓఈ-ఎఫ్పీఓ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
